రోజురోజుకూ పెరుగుతున్న అధిక సంపాదన మోజు
అగ్ర దేశాల వీసాల కోసం లక్షలాది మంది నిరీక్షణ
వీసా వస్తే లాటరీ తగిలినట్టేనని భారతీయుల సంబరం
ఉన్నత చదువు, ఉద్యోగం, ఉపాధి పేరుతో మన దేశం నుంచి ఏటా లక్షలాది మంది విదేశాలకు ఎగిరిపోతున్నారు. ఒకసారి విదేశాలకు వెళ్లిన వారు తిరిగి భారత్కు రావడం ఇంచుమించు జరగడం లేదు. ప్రపంచంలో అతి పెద్ద విదేశీ వీసా భాగస్వాములుగా భారతీయులు నిలుస్తున్నారు. విద్యార్థులు, వృత్తి నిపుణులు అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వీసాల కోసం క్యూలు కడుతున్నారు. అధిక సంపాదన కలను నెరవేర్చుకోవడమే తమ జీవిత లక్ష్యంగా చాలామంది ఉన్నారు.
విదేశాల్లోని మంచి కాలేజీలు, యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తే కెరీర్ అవకాశాలు మెండుగా ఉంటాయన్న ఆశతో పెద్దయెత్తున ప్రతి ఏడాది విద్యార్థులు విదేశాలకు క్యూ కడుతున్నారు. దీనికి లక్షల రూపాయలు ఖర్చవుతున్నా తల్లిదండ్రులు కూడా వెనుకడుగు వేయడం లేదు. వీసా వస్తే చాలు లాటరీ కొట్టినంతగా సంబర పడిపోతున్నారు. ఈ ఏడాది మన దేశం నుంచి సుమారు 18 లక్షల మంది విద్యార్థులు విదేశాల్లో చదువుల కోసం వెళ్లగా, వీరు ఖర్చు చేసిన మొత్తం 80 బిలియన్ డాలర్లు.

వీసాలు కేవలం ప్రయాణానికి నిర్దేశించిన ప్రామాణిక పత్రాలు కాదు.. అవి అవకాశాలకు ముఖద్వారాలు. పెద్దగా చదువుకోని వారు, నిరక్షరాస్యులు ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్నారు. యూఏఈ, ఖతార్, సౌది అరేబియా, కువైట్, ఒమన్, దుబాయ్లకు నిత్యం వేలాది మంది కార్మికులు, శ్రామికులు ఉపాధి కోసం వెళ్తున్నారు. ఇప్పటికే ఆయా దేశల్లో సుమారు 1.3 కోట్ల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అలాగే విదేశాల్లో ఉండే మన దేశ రాయబారులు సైతం తమ పిల్లలను అక్కడే చదివించడానికి ఇష్టపడుతున్నారు. ఉద్యోగ నిర్వహణలో భాగంగా వారు భారత్కు తిరిగి రావాల్సి ఉన్నా, తమ పిల్లలను మాత్రం అక్కడే ఉంచేస్తున్నారు.
వీసా వచ్చిందంటే మాకు హక్కు వచ్చినట్టేనని ఇక్కడి వారు భావిస్తున్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కారణంగా వీసా ప్రక్రియను తాత్కాలికంగా ఆపివేయడంతో ఎన్నికలు ఎప్పుడవుతాయా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అమెరికా 2023లో రికార్డు స్థాయిలో ఎన్నడూ లేనంతగా 1,40,000 విద్యార్థి వీసాలు మంజూరు చేసింది. వీటికి 3,80,000 ఉద్యోగ వీసాలు అదనం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ వరకు ఎక్కువ సంఖ్యలో విద్యార్థి వీసాలు జారీ అయ్యాయి. ధనిక, శ్రేయస్సు దేశంగా పేరొందిన అమెరికా, యూకేలపై అన్ని వర్గాల వారు పరుగులు తీస్తున్నారు. సెప్టెంబర్లో యూఎస్ యూనివర్సిటీలకు పెద్దయెత్తున భారతీయ విద్యార్థులు తరలివెళ్లారు.