ఒక రోజు పూరి జగన్నాథుడిని దర్శించుకోడానికి ఆ రాజ్యానికి చెందిన రాజు గారు జగన్నాథుని ఆలయానికి వెళ్ళారు. అది సాయంత్రం సమయం కావడం.. అప్పటికే చాలా ఆలస్యం అవడంతో తలుపులు మూయబోతున్నారు. ఆలయం వద్ద ఉన్న పూల దుకాణం ఆమె వద్ద ఉన్నవన్నీ అమ్మేసిన తర్వాత కేవలం ఒకే ఒక పువ్వు మిగిలి ఉంది. రాజు గారు ఆ పువ్వుని అడిగారు.. ఆమె ఆ పువ్వుని ఆయనకు ఇవ్వబోతున్న సమయంలో ఒక ధనవంతుడైన వ్యాపారి వచ్చి రెట్టింపు ధర ఇస్తాను ఆ పువ్వుని ఇవ్వమని అడిగాడు. దీంతో వారిద్దరి మధ్య పువ్వు కోసం వేలం ప్రారంభమైంది. చివరకు రాజు గారు తన రాజ్యాన్ని పూల దుకాణం ఆమెకు ఇచ్చి ఆ ఒక పువ్వును వేలంలో దక్కించుకున్నాడు. పువ్వును జగన్నాథుడికి అర్పించి అదే గుడిలోని మండపంలో సామాన్యుడి లా పడుకున్నాడు. ఆ రాత్రి జగన్నాథుడు ఆ రాజు కలలోకి వచ్చి అంతటి బరువును నేను మోయలేను.. ఆ పువ్వును తన తల నుంచి తొలగించమని కోరారు. అప్పుడు ఆ రాజు జగన్నాథుడుని… స్వామీ.. ఈ సృష్టి మొత్తాన్ని చిటికిన వేలుతో ఎత్తగల మీకు ఈ పువ్వు ఎందుకంత భారమైంది అని అడిగాడు.

అప్పుడు జగన్నాథుడు.. రాజా.. నేను ఈ మొత్తం సృష్టిని ఎత్తగలను, కానీ ని నీ భక్తి యొక్క బరువును నేను మోయలేను. రాజా.. నా మీద భక్తి తో.. నాకు అర్పించడం కోసం ఒక పువ్వును పొందటానికి నీ రాజ్యాన్ని త్యాగం చేశావు కదా.. ఇంతటి భారీ మూల్యము ఉన్న భక్తిని మోయడం కష్టమన్నారు. రాజ్యం లేని నీవు రేపు ఎలా బతుకుతావు అని కూడా అలోచించకుండా కల్మషం లేని భక్తితో నన్ను ప్రసన్నం చేసుకున్నావు. నీ భక్తికి చాలా సంతోషంగా ఉంది. వెళ్లి నీ రాజ్యాన్ని నీవే ఏలుకో.. అని చెప్పి ఆ జగన్నాథుడు మాయమైపోయారు. భగవంతుడికి కావాల్సింది కల్మషం లేని భక్తి ఒక్కటే. ( సేకరణ )