ఓటర్లకు వెసులుబాటు… బీఎల్ఓలకు సులభమైన ఎన్యూమరేషన్
ఎల్బీనగర్:
మహేశ్వరం నియోజకవర్గ పరిధి సరూర్ నగర్ మండల్ లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి ఆదేశాలతో తహసీల్దార్ పి. వేణుగోపాల్ విద్యా విహార్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, భగత్ సింగ్ నగర్ ప్రభుత్వ పాఠశాల, వీఎం హోమ్ ల నందు గల పోలింగ్ బూత్ ల వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ డెస్క్ల ద్వారా ఓటర్లు తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవడం, అవసరమైన పత్రాలను సమర్పించడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం వంటి సేవలను ఒకే చోట పొందే అవకాశం కల్పించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, ప్రతి అర్హుడైన ఓటరు జాబితాలో పేరు కొనసాగేందుకు లేదా అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునేందుకు హెల్ప్ డెస్క్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఓటర్లు తప్పనిసరిగా బీఎల్ఓలకు సహకరించి అవసరమైన వివరాలు, ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని కోరారు.హెల్ప్ డెస్క్ల ఏర్పాటు వల్ల బీఎల్ఓలకు ఇంటింటి ఎన్యూమరేషన్ ప్రక్రియ కూడా మరింత సులభతరం అవుతుందని, పత్రాల పరిశీలన,దరఖాస్తుల స్వీకరణ, వివరాల నమోదు వేగంగా పూర్తవుతాయని అధికారులు తెలిపారు. దీంతో ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఓటర్లు ఎలాంటి అపోహలకు లోను కాకుండా అధికారుల సూచనలను పాటించాలని, తమ ఓటు హక్కు పరిరక్షణలో భాగంగా సర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని తహసీల్దార్ పి. వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు.


