- ఈసీఐ అధికారులమని హెచ్చరికలు.. రూ. 5 ఫీజు పేరుతో ఖాతాలు ఖాళీ చేస్తున్న వంచకులు
- ఎన్యూమరేషన్ ఫారమ్ల పేరుతో అప్రమత్తంగా ఉండాలని ప్రధాన ఎన్నికల అధికారి హెచ్చరిక
హైదరాబాద్:
ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఓటర్ల జాబితాను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరతీశారు. దేశ అత్యన్నత సంస్థ అయిన ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) పేరును అడ్డుపెట్టుకుని అమాయక ఓటర్లను నిండా ముంచేందుకు కుట్ర పన్నుతున్నారు. ఓటర్ల గుర్తింపు కార్డులు, ఎన్యూమరేషన్ నమోదు ప్రక్రియలో అవాస్తవాలను చూపుతూ మోసపూరిత డిజిటల్ సందేశాలను పంపుతున్న వంచకుల ఉదంతం తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) దృష్టికి వచ్చింది.

*డిజిటల్ వల.. ఆర్థిక దోపిడీ
ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టడమే లక్ష్యంగా ఈ సైబర్ దొంగలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఓటర్ల నమోదు ఫారమ్లలోని వివరాలు సరిపోలడం లేదని, తద్వారా వాటిని తిరస్కరించినట్లు తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారు. ఆపై బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రత్యేక నంబర్లకు ఫోన్ చేయాలని లేదా వాట్సాప్ ద్వారా పంపిన నకిలీ లింక్లను క్లిక్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.
ఆన్లైన్ ఫారమ్ను పునరుద్ధరించే నెపంతో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ల ద్వారా నామమాత్రంగా రూ. 5/- చెల్లించాలని కోరుతున్నారు. ఈ చెల్లింపుల ప్రక్రియలో భాగంగా లాగిన్ వివరాలు, రహస్య పాస్వర్డ్లు, ఏటీఎం పిన్ నంబర్లు, సీవీవీ (CVV) సంఖ్యలను తస్కరించి, నిమిషాల వ్యవధిలో ఖాతాల్లోని నగదును పూర్తిగా ఖాళీ చేస్తున్నారు.
*ఈసీఐ తీవ్ర స్పందన.. అధికారిక ప్రకటన
ఈ మోసపూరిత చర్యలపై ఎన్నికల సంఘం అత్యంత తీవ్రంగా స్పందించింది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) గానీ, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి సందేశాలను, ఎస్ఎంఎస్లను పంపబోవ స్పష్టం చేసింది. ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు లేదా ఆన్లైన్ చెల్లింపులను కోరేందుకు ఎలాంటి అధికారిక ఆదేశాలు ఇవ్వలేదని తేల్చిచెప్పింది.
*ఓటర్లకు హెచ్చరికలు.. కఠిన చర్యలకు ఆదేశం
ప్రజలు ఎవరూ కూడా ఇటువంటి నకిలీ కాల్స్, మోసపూరిత సందేశాలను నమ్మవద్దని, వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని ప్రధాన ఎన్నికల అధికారి తీవ్రంగా హెచ్చరించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఆర్థికంగా నష్టపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరికైనా ఇటువంటి అనుమానాస్పద సందేశాలు లేదా కాల్స్ వస్తే, వెంటనే అప్రమత్తమై సమీపంలోని పోలీస్ స్టేషన్లో లేదా సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజాస్వామ్య పవిత్రతను దెబ్బతీసే ఇటువంటి అసాంఘిక శక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.



