“కాంగ్రెస్ బాకీ కార్డు”తో బీఆర్ఎస్ నిరసన
ఎల్బీనగర్:
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో “కాంగ్రెస్ బాకీ కార్డు” కార్యక్రమం నిర్వహించారు.ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సరూర్నగర్ స్టేడియం నుండి కొత్తపేట వరకు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం వివిధ వర్గాల ప్రజలకు ఎంత బకాయి ఉందో వివరిస్తూ భారీ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేయాల్సిన హామీలను ఈ విధంగా పేర్కొన్నారు:
- మహిళలకు: ఒక్కొక్కరికి నెలకు ₹2,500 చొప్పున 33 నెలలకు ₹82,500 బకాయి.
- వృద్ధులు, బీడీ కార్మికులకు: నెలకు ₹4,000 పెన్షన్ చొప్పున ₹66,000 బకాయి.
- దివ్యాంగులకు: నెలకు ₹6,000 పెన్షన్ చొప్పున ₹66,000 బకాయి.
- కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్: ఆడబిడ్డల వివాహాలకు తులం బంగారం బకాయి.
- విద్యార్థులకు: ఎన్నికల హామీలో పేర్కొన్న స్కూటీలు బకాయి.
- ఫీజు రీయింబర్స్మెంట్: కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలుగా ₹12,000 కోట్లు బకాయి.
- రైతు భరోసా / రుణమాఫీ : 4 ఎకరాల రైతుకు రైతు భరోసా కింద ₹1,02,000, రుణమాఫీ కింద ₹2,00,000 బకాయి అని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
- వరి పంటకు ₹500 బోనస్: ప్రతి ఎకరాకు ₹12,500, ప్రతి పంటకు ₹75,000 బకాయి అని తెలిపారు.
- రైతు కూలీలకు: ఉపాధి హామీ పథకం కింద సంవత్సరానికి ₹12,000 చొప్పున, రెండు నెలలకు ₹24,000 బకాయి అని పేర్కొన్నారు.
- నిరుద్యోగులకు: 2 లక్షల ఉద్యోగాలు మరియు 33 నెలలకు నిరుద్యోగ భృతి కింద ₹1,32,000 బకాయి అని తెలిపారు.
- విద్యా భరోసా కార్డు: విద్యార్థులకు ₹5,00,000 బకాయి అని పేర్కొన్నారు.
- ఆటో కార్మికులకు: సంవత్సరానికి ₹12,000 చొప్పున, రెండు నెలలకు ₹24,000 బకాయి అని తెలిపారు.
కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: సుధీర్ రెడ్డి
అనంతరం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.“అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని సుధీర్ రెడ్డి గారు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళలు, పార్టీ అభిమానులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


