భారతీయ మేధో వారసత్వాన్ని సజీవంగా ఉంచడమే ధ్యేయం..
దీనిపై చొరవ తీసుకుంటున్నట్లు వెల్లడించిన జె ఎన్ యూ వర్గాలు..
దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో ఎన్నో సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఇటీవల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. ప్రపంచమంతా గొప్పగా చెప్పుకొనే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఆయాదేశాలు పాఠ్యాంశాలుగా బోధిస్తున్నాయి. కానీ మన దేశంలోని విద్యాసంస్థలు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.
ఈ తరహా అభిప్రాయాలకు చెక్ పెడుతూ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం భారతీయ నాలెడ్జ్ ట్రెడిషన్స్ పై కొత్త ఎలక్టివ్ కోర్సును ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. తద్వారా ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ సహా వివిధ విభాగాలలోని విద్యార్థులకు భారతదేశపు ప్రాచీన విజ్ఞాన వ్యవస్థలను అన్వేషించే అవకాశాన్ని అందించాలని ప్రయత్నాలు చేస్తోంది.
భారతీయ మేధో వారసత్వాన్ని ఆధునిక విద్యతో అనుసంధానించడానికి చొరవ తీసుకున్నట్లు జె. ఎన్ యూ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వివిధ స్థాయిలలో సమస్యలను పరిష్కరించడంలో ఆనాటి దృష్టాంతాలను ఉపయోగించగలగే విధంగా, ప్రాచీన భారతదేశం సాంకేతిక పురోగతి గురించి విద్యార్థులకు బోధించాలని తీర్మానించినట్లు చెప్పారు. జె. ఎన్ యూ లోని అన్ని కాలేజ్లలో ఈ ఎలక్టివ్ కోర్సు అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఐ.కె.టి. లో వేద శాస్త్రాలు, సాంప్రదాయ వైద్యం, పురాతన ఇంజనీరింగ్ పద్ధతులు మరియు తాత్విక సాహిత్యం వంటి విస్తృత శ్రేణి విషయాలు ఉంటాయి. అయితే ఆయా విభాగాలు వారి నిర్దిష్ట అధ్యయన రంగాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందిస్తాయని స్పష్టం చేశారు. అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు సాంప్రదాయ ఇంజనీరింగ్ పద్ధతుల గురించి, మేనేజ్మెంట్ విద్యార్థులు పురాతన మరియు ఆధునిక ఆర్థిక, పరిపాలనా వ్యవస్థలను అన్వేషించవచ్చు.