Thursday, July 23, 2026
Google search engine
Homeతెలంగాణ*బాధితుల రక్తం పిండే రియల్ రాబందులు!

*బాధితుల రక్తం పిండే రియల్ రాబందులు!

ఎదులాబాద్‌ రైతు ధర్మారెడ్డి భూమిపై ‘అన్మోల్ అర్బన్ టౌన్స్’ కన్ను.. కోర్టునూ తప్పుదోవ పట్టించి కబ్జా యత్నం!

ఘట్‌కేసర్:

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బ్రోకర్ వ్యవస్థ పెరిగిపోయి, అమాయకులైన రైతులను, నివాసాలు కొనుగోలు చేసే ప్రజలను నిలువునా ముంచుతోంది. అక్రమార్జనే ధ్యేయంగా చట్టాలను, కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తూ సాగిస్తున్న ఈ ‘రియల్ రాబందుల’ ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే సహించేది లేదని ఎదులాబాద్ గ్రామానికి చెందిన బాధితుడు, రైతు చందుపట్ల ధర్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకబ్జాలకు పాల్పడుతూ, దగా చేస్తున్న సదరు వెంచర్ నిర్వాహకులకు ప్రజాక్షేత్రంలోనే తగిన శాస్తి చేస్తానని స్పష్టం చేశారు.

*గుంతలు పూడుస్తామని నమ్మించి… గొయ్యి తవ్వారు!
ఎదులాబాద్ పరిధిలోని సర్వే సంఖ్య 56 లో చందుపట్ల ధర్మారెడ్డికి మూడు ఎకరాల పట్టా భూమి ఉంది. ఆయన భూమికి ఆనుకుని ఉన్న సర్వే సంఖ్యలు 41/P, 42/P, 55/P, 57/P, 58/P ల పరిధిలో దాదాపు 1,37,360.37 చదరపు గజాల విస్తీర్ణంలో ‘అన్మోల్ అర్బన్ టౌన్స్’ పేరుతో ఒక నివాస వెంచర్ నిర్మిస్తున్నారు.
ఈ వెంచర్ ప్రతినిధులు మౌనిక రెడ్డి, నవీన్ అనే వ్యక్తులు ధర్మారెడ్డి వద్దకు వచ్చి, “మీ పొలంలో గుంతలు ఎక్కువగా ఉన్నాయి, వాటిని ఉచితంగా మట్టితో పూడ్చివేస్తాం” అని నమ్మబలికారు. వారి మాటలను విశ్వసించిన రైతును దారుణంగా మోసం చేశారు. మట్టి పూడ్చివేత నెపంతో రైతు భూమిలోకి ప్రవేశించి, అక్రమంగా ఆ భూమిలోనే వెంచర్‌కు సంబంధించిన భారీ మురుగునీటి నిల్వ వ్యవస్థను (సెప్టిక్ ట్యాంక్) నిర్మించడం ప్రారంభించారు.

*కోర్టు ఆదేశాలను దుర్వినియోగం చేస్తూ బెదిరింపులు
ధర్మారెడ్డి ఈ ఆక్రమణను ప్రశ్నించగా, సదరు ప్రతినిధులు ఆయనను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశారు. తప్పుడు సర్వే సంఖ్యలతో సరిహద్దుల తారుమారు చేసి, న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించి కొన్ని తాత్కాలిక ఉత్తర్వులు తెచ్చుకున్నట్లు బాధితుడు తెలిపారు. ఆ ఉత్తర్వుల ముసుగులో రైతు భూమిని ఆక్రమించడమే కాకుండా, “ఏం చేసుకుంటావో చేసుకో” అంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు.

*”రైతు కష్టార్జితాన్ని ఆక్రమించి, తప్పుడు దస్త్రాలతో కోర్టులను మభ్యపెట్టి నిర్మాణాలు చేపట్టడం అక్షరాలా నేరం. బ్రోకర్ తెలివితేటలతో ఆటలు సాగిస్తే చట్టరీత్యా, సామాజికంగా బుద్ధి చెబుతాం.”
*చందుపట్ల ధర్మారెడ్డి (బాధిత రైతు)

*కొనుగోలుదారులు మోసపోవద్దు: హెచ్చరిక
ఈ దగా కేవలం రైతుకే పరిమితం కాలేదు. అక్రమంగా ఆక్రమించిన భూమిలో వెంచర్ నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు, స్థలాలు విక్రయించి పరారయ్యేందుకు సదరు వెంచర్ నిర్వాహకులు కుట్ర పన్నుతున్నారు. భవిష్యత్తులో ఈ స్థలాలు కొనుగోలు చేసే సామాన్య ప్రజలు తీవ్ర న్యాయపరమైన చిక్కుల్లో పడతారని ధర్మారెడ్డి హెచ్చరించారు. ఘట్‌కేసర్, ఎదులాబాద్ ప్రాంత ప్రజలు ‘అన్మోల్ అర్బన్ టౌన్స్’ వెంచర్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లు గానీ, స్థలాలు గానీ కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు.

*పోలీసులకు ఫిర్యాదు – సమగ్ర విచారణకు డిమాండ్
తన భూమిని ఆక్రమించి బెదిరింపులకు పాల్పడుతున్న మౌనిక రెడ్డి, నవీన్ తదితర ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్మారెడ్డి ఘట్‌కేసర్ రక్షకభట నిలయంలో సమగ్ర ఆధారాలతో ఫిర్యాదు చేశారు. తప్పుడు దస్త్రాలు సృష్టించి కోర్టును, ప్రజలను మోసం చేస్తున్న ఈ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments