రాంపల్లిలో భూకబ్జా ముఠా గుట్టురట్టు*నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయం.. ఆరుగురు నిందితుల అరెస్టు
మల్కాజ్గిరి,కీసర:
ఖాళీగా ఉన్న ప్లాట్లే లక్ష్యంగా నకిలీ పత్రాలు సృష్టించి, భూకబ్జాలకు పాల్పడుతున్న ముఠాను కీసర పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజిగిరి డీసీపీ సి.హెచ్. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి దొప్పలపూడి రవీంద్రకు రాంపల్లి గ్రామంలోని సర్వే నంబరు 404, 405లో 300 గజాల ప్లాట్ (నెం.108) ఉంది. దీన్ని 1983లో ఆయన కొనుగోలు చేశారు. అయితే, తన ప్లాట్ను కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో ఇతరులకు విక్రయించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అధికారుల అండతో అక్రమాలు
నిందితులు పథకం ప్రకారం యజమానులు అందుబాటులో లేని ఖాళీ ప్లాట్లను గుర్తించి, వాటికి నకిలీ లింక్ డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ ఉదయ్ రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ రెహమాన్ సహకారంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు సాగుతున్నట్లు విచారణలో తేలింది.
రిజిస్ట్రేషన్ల పరంపర ఇలా..
- తొలుత ధర్మారావు అనే వ్యక్తిని యజమానిగా చూపిస్తూ ప్రదీప్ కుమార్కు విక్రయించారు.
- ప్రదీప్ కుమార్ ఆ ప్లాట్ను రెండు భాగాలుగా చేసి ప్రభాకర్, నరేష్లకు అమ్మారు.
- వారిద్దరి నుంచి జీవీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత గుబ్బల వెంకటేశ్వరరావు కొనుగోలు చేశారు.
- చివరగా జంగాల శ్రీరామ్, విజయలక్ష్మి దంపతుల పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది.
కటకటాల్లోకి ఆరుగురు
తక్కువ సమయంలో అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ మోసాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. ఈ కేసులో జంగాల శ్రీరామ్, గుబ్బల వెంకటేశ్వరరావు, బందెల్ల ప్రశాంత్, బందెల్ల ప్రభాకర్, పొన్నబోయిన బాలకృష్ణతో పాటు డాక్యుమెంట్ రైటర్ ఉదయ్ రెడ్డిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. కేసును ఛేదించిన ఏసీపీ చక్రపాణి, ఇన్ స్పెక్టర్ ఆంజనేయులు, ఎస్సై అనిల్ కుమార్ బృందాన్ని డీసీపీ అభినందించారు.


