- *ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సాయికిరణ్కు ఘన సన్మానం
- *టిపిసిసి ఎస్సీ విభాగం కార్యదర్శి ఓం ప్రకాష్కు కేఎల్ఆర్ అభినందనలు
*తుక్కుగూడ:
చదువుతోనే జ్ఞానం, సమాజంలో గుర్తింపు, కుటుంబ గౌరవం లభిస్తాయని, ప్రతి ఒక్కరి భవిష్యత్ మనుగడ విద్యపైనే ఆధారపడి ఉంటుందని లీడ్ ఇండియా అధినేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) పేర్కొన్నారు.
కందుకూరు మండలం ఆకులమైలారం గ్రామానికి చెందిన బిడిఎల్ (BDL) ఉద్యోగి రాణా ప్రతాప్ కుమారుడు అనేమోని సాయికిరణ్ ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని కే.ఎల్.ఆర్ కొనియాడారు.
తుక్కుగూడలోని కార్యాలయంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అండేకార్ సురేందర్ ఆధ్వర్యంలో సాయికిరణ్ను కే.ఎల్.ఆర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాయికిరణ్కు కే.ఎల్.ఆర్ పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. సాయికిరణ్ ఆదాయపు పన్ను శాఖలో పర్యవేక్షకుడు (ఇన్ కమ్ టాక్స్ సూపరింటెండెంట్), కనిష్ట సహాయకుడు (జూనియర్ అసిస్టెంట్), సరుకుల రవాణా రైలు అధికారి (గూడ్స్ ట్రైన్ మేనేజర్) ఉద్యోగాలకు ఎంపిక కాగా… ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమయ్యారు.
*బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: కేఎల్ఆర్
అనంతరం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ఎస్సీ విభాగం కార్యదర్శిగా నియమితులైన కొండ్ర ఓం ప్రకాష్ను కే.ఎల్.ఆర్ శాలువా కప్పి అభినందించారు. సామాజిక మాధ్యమాలు, పార్టీ బాధ్యతలు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కేఎల్ఆర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



