నీట్ పేపర్ లీకేజీని ప్రశ్నిస్తే అరెస్టులా? | ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో మోదీ, అమిత్షా దిష్టిబొమ్మల దహనం
ఇబ్రహీంపట్నం:
దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఇబ్రహీంపట్నంలో భారీ ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నేతృత్వంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంబేద్కర్ చౌరస్తాలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా దిష్టిబొమ్మలను దహనం చేశారు.

*బ్రిటిష్ పాలనను తలపిస్తున్న నిరంకుశత్వం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి.రంగారెడ్డి మాట్లాడుతూ… స్వతంత్ర భారత చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడం కేంద్ర పరిపాలనా వైఫల్యానికి అద్దం పడుతోంది. ఈ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ అగ్రనేతలను అరెస్టులు చేయడం అత్యంత హేయమైన చర్య” అని మండిపడ్డారు.
స్వాతంత్ర్య పోరాటం నుండి నేటి వరకు గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, అటువంటి నాయకత్వాన్ని అక్రమ అరెస్టులతో అణచివేయాలని చూడటం పాలకుల అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. నేటి పరిస్థితులు నాటి బ్రిటిష్ పాలనను తలపిస్తున్నాయని, ప్రశ్నించే గొంతులను నొక్కేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు.
*బిజెపి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
అక్రమ అరెస్టులు, నిరంకుశ ధోరణులతో పరిపాలన సాగిస్తున్న బిజెపి సర్కార్కూ రోజులు దగ్గరపడ్డాయని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమయ్యాయని, రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశ రక్షణ, విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.



