- ఉన్నత విద్య కోసం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం..
- బాసర ట్రిపుల్ఐటీలో చేరనున్న విద్యార్థిని హర్షినికి ఉన్నత చదువులకు భరోసా..
పటాన్చెరు:
పేదరికం ప్రతిభకు అడ్డంకి కాకూడదన్న సంకల్పంతో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఉన్నత విద్యను కొనసాగించే అవకాశాన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోల్పోయే పరిస్థితిలో ఉన్న ఓ నిరుపేద విద్యార్థినికి రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి ఆమె విద్యా భవిష్యత్తుకు అండగా నిలిచారు.
తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని హర్షిని, 574 మార్కులతో ప్రతిష్ఠాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులతో ఫీజులు చెల్లించడం సాధ్యం కాక, ఉన్నత విద్యపై ఆశలు సన్నగిల్లాయి.
ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. విద్యార్థినిని, ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి ధైర్యం చెప్పడంతో పాటు, బాసర ట్రిపుల్ఐటీలో ఆరు సంవత్సరాల విద్యాభ్యాసానికి అవసరమైన ఫీజుల నిమిత్తం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థులు కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో హర్షిని ఉన్నత విద్యాభ్యాసానికి అండగా నిలిచామని తెలిపారు. భవిష్యత్తులోను సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే అందించిన సహాయానికి విద్యార్థిని హర్షిని, ఆమె కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


