Saturday, September 12, 2026
Google search engine
Homeతెలంగాణచెరువుల రక్షణకు సర్కారు పటిష్ట చర్యలు:

చెరువుల రక్షణకు సర్కారు పటిష్ట చర్యలు:

– మత్స్యకార బతుకులకు సర్కార్‌ అండ

  • ఎఫ్‌టీఎల్‌ హద్దుల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదు
  • అన్ని చెరువులకు త్వరలోనే ప్రత్యేక రక్షణ కమిటీలు
  • ఇప్పటివరకు 44 వేల చెరువులకు జియో ట్యాగింగ్‌ పూర్తి
  • నెల్లికల్‌ ఎత్తిపోతల పూర్తిపై శాసనమండలి వేదికగా స్పష్టమైన హామీ
  • పీడీఎస్‌లో అదనపు నిత్యావసర సరుకుల పంపిణీపై సానుకూల పరిశీలన

హైదరాబాద్‌:

చెరువు నిండితేనే పల్లె సిరులు వికసిస్తాయని, మత్స్యకారుడి వల నిండితేనే ఆ కుటుంబంలో చీకట్లు తొలగి వెలుగులు విరుస్తాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గొంతు ఎత్తి స్పష్టం చేశారు. జలవనరుల పరిరక్షణతోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మనుగడ ముడిపడి ఉందని తేల్చిచెప్పారు. శాసనమండలిలో శుక్రవారం జరిగిన సుదీర్ఘ చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రజా సమస్యలపై మంత్రి ఉద్వేగభరితంగా, నిర్భయంగా స్పందించారు. చెరువుల పూర్తి నీటిమట్టం హద్దుల రక్షణ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని హెచ్చరించారు.

*జలవనరుల ఆక్రమణలపై ఉక్కుపాదం
చెరువుల పూర్తి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్‌) హద్దులను ప్రతి అంగుళం కాపాడుతామని మంత్రి సభాముఖంగా శపథం చేశారు. కబ్జాల బారిన పడుతున్న జలవనరులను రక్షించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని తెలిపారు. సభ్యులు ప్రత్యేకంగా ప్రస్తావించిన నిర్దిష్ట జలవనరుల సమస్యలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా తామే స్వయంగా క్షేత్ర పరిశీలన జరిపి, స్థానిక మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందజేయాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా హద్దులు దెబ్బతిన్నా, కబ్జాలు జరిగినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, క్షణం ఆలస్యం చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు.

*పరిరక్షణ కమిటీల పునరుద్ధరణ – 44 వేల చెరువులకు జియో ట్యాగింగ్‌
రాష్ట్రంలో చెరువుల సంరక్షణను ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం చేయాలనే లక్ష్యంతో అన్ని జలవనరులకు రక్షణ, నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. ఉమ్మడి పాలనలో పటిష్టంగా ఉన్న ఈ కమిటీల వ్యవస్థను గత పాలకులు నిర్వీర్యం చేశారని, నేడు వాటిని మళ్లీ పునరుద్ధరిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 44 వేల చెరువులకు జియో ట్యాగింగ్‌ ప్రక్రియను పూర్తి చేశామని, దీనివల్ల ఆక్రమణలను ఉపగ్రహం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం లభిస్తుందని వివరించారు. చెరువుల రక్షణ కోసం నిధుల కొరత ఎట్టిపరిస్థితుల్లోనూ రానివ్వబోమని తేల్చిచెప్పారు.

*నెల్లికల్‌ ఎత్తిపోతలపై కాలబద్ధమైన స్పష్టత
నల్లగొండ జిల్లాలోని ప్రతిష్టాత్మక నెల్లికల్‌ ఎత్తిపోతల పథకాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి తీరుతామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భీష్మించుకుని ప్రకటించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో మూలనపడిన ఈ ప్రాజెక్టుకు గతంలో కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే విదిలించగా, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా 310 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి పనులకు అత్యంత వేగమిచ్చిందని గుర్తుచేశారు.
ఈ బృహత్తర ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేసి రైతుల దశాబ్దాల కలను సాకారం చేస్తామని ప్రకటించారు:

  • మొదటి దశ కింద జూన్‌ 2027 నాటికి 7,800 ఎకరాలకు సాగునీరు అందిస్తాం.
  • రెండో దశ కింద డిసెంబర్‌ 2027 నాటికి మిగతా ఆయకట్టును కలుపుకుని మొత్తం 24 వేల ఎకరాలకు జలసిరులు పారిస్తాం.

*ఆహార భద్రత నుంచి పోషక భద్రత దిశగా అడుగులు
పేదల ఆకలి తీర్చడమే కాకుండా వారి ఆరోగ్యానికి భరోసా కల్పించే దిశగా ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌తోపాటు పలువురు సభ్యులు చేసిన విలువైన సూచనలపై సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం ఇస్తున్న రేషన్‌ సరుకులతో పాటు అదనంగా పప్పులు, వంట నూనెలు వంటి పౌష్టికాహార వస్తువులను కూడా చౌకధరల దుకాణాల ద్వారా అందించే ప్రతిపాదన తీవ్ర పరిశీలనలో ఉందని తెలిపారు. దీనివల్ల పేదలకు సంపూర్ణ పోషక భద్రత లభించడంతో పాటు, రాష్ట్రంలో పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు ఊతమిచ్చినట్లవుతుందని మంత్రి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments