అమరవీరుల ఆశయ సాధనకు టి.జే.ఎఫ్ ప్రతిజ్ఞ | జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లతో గుర్తింపు కమిటీ కీలక భేటీ
*హైదరాబాద్:
నాలుగు కోట్ల మంది ప్రజల అస్తిత్వ పతాక, ఆత్మగౌరవ ప్రతీక అయిన తెలంగాణ తల్లికి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టి.జే.ఎఫ్) నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్న కీలక సమావేశానికి ముందు టి.జే.ఎఫ్ నేతలు హైదరాబాద్లోని తెలంగాణ అమరవీరుల స్మారక ప్రాంగణాన్ని సందర్శించారు. అక్కడ కొలువుదీరిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం అమరజ్యోతి వద్ద ఉద్యమ అమరవీరులకు స్మరణాంజలి ఘటించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు, వైద్యులు, న్యాయవాదుల సంక్షేమం, గుర్తింపు లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని పోరాడిన ఈ వృత్తినిపుణుల హక్కుల సాధనకు కార్యాచరణ రూపొందించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్ గౌడ్, నాయకులు మేకల కృష్ణ, పాలకూరి రాజు, పోగుల ప్రకాశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.


