మహేశ్వరం:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నిరుపేదల ఆరాధ్య దైవం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలు చిరస్మరణీయమని, ఆయన అందించిన సంక్షేమ పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతోలిఖించబడిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పేర్కొన్నారు.
మహేశ్వరం నియోజకవర్గం, బాలాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పారిజాత నర్సింహారెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలోని చివరి వర్గానికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 సేవలు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు కోట్ల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని కొనియాడారు. కేవలం పథకాల అమలు మాత్రమే కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆయన సాగించిన పాదయాత్ర రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని స్పష్టం చేశారు.
*చారిత్రక సంక్షేమ శకం
స్వాతంత్ర్య భారత రాజకీయ చరిత్రలో సంక్షేమానికి పెద్దపీట వేసిన పరిపాలకుడిగా వైఎస్సార్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చడానికి ఆయన ప్రాజెక్ట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పేదవాడికి ఇల్లు, నిరుపేదలకు వైద్యం అందించిన ఆయన జననేతగా ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆశయ సాధన దిశగా ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఎర్ర జైహింద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల రాజేందర్ రెడ్డి, బలింగని జంగయ్య, డివిజన్ అధ్యక్షులు నీరుడు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు బాలాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరై తమ ప్రియతమ నేతకు శ్రద్ధాంజలి ఘటించారు.



