సైనిక సంక్షేమ శాఖ సహకారంతో హైదరాబాద్లో ఘనంగా ఒరియంటేషన్ కార్యక్రమం
హైదరాబాద్:
దేశ రక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వీర రత్న ఫౌండేషన్ (వీఆర్ఎఫ్) అడుగులు వేస్తోంది. సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని సైనిక్ ఆరామ్ ఘర్ ప్రాంగణంలో వీరనారీల మహిళా సాధికారత సదస్సు మరియు ప్రత్యేక ఒరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
దేశ సేవలో అత్యున్నత త్యాగాలు చేసిన సాయుధ దళాలు (ఆర్మ్డ్ ఫోర్సెస్) మరియు కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) వీరనారులు, వారి పిల్లల సామాజిక, ఆర్థిక పురోగతే ధ్యేయంగా ఈ సదస్సును చేపట్టారు.
*సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహన
ఫౌండేషన్ ప్రతినిధి దీప్తి శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సుమారు 30 మంది లబ్ధిదారులు (వీరనారులు, కుటుంబ సభ్యులు) ఉత్సాహంగా పాల్గొన్నారు. సంస్థ అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, సేవలు, వాటిని పొందే విధానంపై లబ్ధిదారులకు క్షుణ్ణంగా వివరించారు. భవిష్యత్తులో వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చేలా తగు మార్గదర్శకత్వం అందించారు.
*అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు మాట్లాడుతూ.. వీరనారుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న వీర రత్న ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఇలాంటి సదస్సులు అమరవీరుల కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సైనిక సంక్షేమ శాఖ ఎప్పుడూ వీరనారుల వెంటే ఉంటుందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్ కుమార్ నోరితో పాటు పలువురు శాఖాధికారులు పాల్గొన్నారు.


