అడ్డగోలుగా దుర్వినియోగం అవుతున్న సమాచార హక్కు చట్టం..
వ్యక్తిగత ప్రతీకార సాధనంగా మారిపోయి ప్రమాదాలకు దారితీస్తోంది..
బ్లాక్మెయిల్కు ఆయుధంగా వాడబడుతుండటం గర్హనీయం..
పారదర్శకత కోసం తెచ్చిన చట్టం, వ్యక్తిగత స్వార్థం కోసమా..?
సమాచారం అడగడం హక్కు.. ఆ హక్కును ఎవరు కాపాడుతున్నారు..?
సమాచార హక్కు బాధ్యతగల ఒక పౌరుని ఆయుధం..
2005 ఈ సంవత్సరంలో ఒక అద్భుతమైన చట్టాన్ని రూపొందించింది అప్పటి ప్రభుత్వం.. ఆ చట్టం ప్రజల చేతిలో పాశుపతాస్త్రంగా మారింది.. అవినీతి అధికారులు, నాయకుల గుండెల్లో గుబులు రేపింది.. అదే సమాచార హక్కు చట్టం.. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, 2005.. ఈ చట్టం భారత ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైనది. కానీ దాని వలన ఎంతో ఉపయోగం ఉన్నా.. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న దూర్తుల నుంచి పెను ప్రమాదం ఎదురవుతోంది.. దాంతో మన వ్యవస్థ బలహీనమవుతోంది.. సమాచార హక్కు చట్టం ఉద్దేశ్యం ఎంతో అద్భుతంగా వుంది.. కానీ ఈ చట్టం మరీ ప్రమాదకరంగా మారిపోయింది.. నిజాలను తెలుసుకోవడానికి ప్రవేశపెట్టబడిన ఈ చట్టం.. దుర్వినియోగం అవుతుండటం దురదృష్టకరం..
2005లో అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రధాన ఉద్దేశ్యం.. ప్రజలకు ప్రభుత్వ వ్యవహారాలపై సమాచారం పొందే హక్కును ఇవ్వడం, ప్రజాస్వామ్యాన్ని పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మార్చడం. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)( ఏ ) “వాక్ స్వాతంత్రానికి మరింత విస్తరణగా భావిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సమాచారం లేకుండా స్వేచ్ఛ అనేది అర్ధరహితం అనేది మేధావుల భావన..
ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, విద్యుత్ సంస్థలు, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ పాఠశాలలు వంటి అన్ని పబ్లిక్ అథారిటీస్ వద్ద నుండి సమాచారం నిర్భయంగా కోరవచ్చు. 30 రోజుల్లో సమాధానం, సమాచారం ఇవ్వడం తప్పనిసరి.. ఒకవేళ అడిగిన సమాచారం ఇవ్వకపోతే లేదా ఆలస్యం అయితే సంబంధిత అధికారులు చట్టపరంగా శిక్షార్హులు అవుతారు..
ప్రతి శాఖలోనూ ఒక సమాచార అధికారి ఉంటారు.. వీరీ వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తుంటారు.. ఇందులో అపీల్ హక్కు అనేది ముఖ్యమైనది.. మొదటి అపీల్, రెండవ అపీల్ ద్వారా ప్రజలు తమ హక్కును రక్షించుకోవచ్చు. కోరిన సమాచారాన్ని పొందవచ్చు..
సంబంధిత అధికారులు అడిగిన సమాచారం ఇవ్వకపోతే రూ. 250 ప్రతీ రోజు జరిమానా, గరిష్ఠంగా రూ. 25,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.. కానీ ఈ విషయం చాలా మందికి తెలియకపోవడం దురదృష్టం..
అనేక ప్రభుత్వ శాఖలలో బ్లాక్ మనీ, టెండర్ లోపాలు, ఫేక్ బెనిఫిషియరీలు ఈ చట్టం ద్వారా బయటపడ్డాయి. అదేవిధంగా అధికారులు ఆర్.టి.ఐ. వస్తుంది.. అని భయంతో జాగ్రత్త పడుతున్నారు. ఇక అవగాహన ఉన్న పేదలు, మధ్యతరగతి ప్రజలు రేషన్ కార్డు, పెన్షన్, హౌసింగ్, పథకాల్లో తమ హక్కు పొందేందుకు ఆర్.టి.ఐ.ని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ చట్టం మీడియాకు బలమైన ఆయుధంగా మారిపోయింది.. జర్నలిస్టులు అనేక స్కాంలను ఆర్.టి.ఐ. ఆధారంగా వెలుగులోకి తీసుకొచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి.. అదేవిధంగా పారదర్శకత పెరిగింది.. కొంతమేర ప్రభుత్వ చర్యలు ప్రజల కంటికి అందుబాటులోకి వచ్చాయి.
అయితే, ఈ చట్టాన్ని కొంతమంది బ్లాక్మెయిల్ టూల్ లాగా వాడుతుండటం శోచనీయం.. వ్యక్తిగత పగల కోసం ఆర్.టి.ఐ. వేస్తున్నారు.. అంతే కాకుండా ఉద్యోగులపై, సిబ్బందిపై కక్ష సాధించడానికి కొందరు అపారమైన ఆర్.టి.ఐ. లు వేస్తున్నట్టు తెలుస్తోంది..
ఈ క్రమంలో బ్లాక్మెయిల్ మాఫియా కూడా ఏర్పడింది.. కొందరు ఆర్.టి.ఐ. ద్వారా ఫైల్ తీసుకుని, ఆ సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ఉండాలంటే తమకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇందులో ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు.. పొలిటికల్ లీడర్స్ ఉన్నారు.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు.. దురదృష్టం ఏమిటంటే ఆర్.టి.ఐ. వేస్తా.. తర్వాత మీ ఇష్టం అనే బెదిరింపులతో సొసైటీలో ఎన్నెన్నో అవరోధాలు కలుగుతున్నాయి.. ప్రభుత్వ పనితీరు కూడా స్తంభించిపోతుంది. అలాగే ప్రతీ చిన్న విషయం కోసం ఆర్.టి.ఐ. వేసి, అధికారులు దానికి సమాధానం ఇవ్వడంలో సమయం వృధా చేస్తున్నారు.
ఇక ఫేక్ పేర్లతో దరఖాస్తులు వస్తుండటం కూడా జరుగుతోంది.. అసలు వ్యక్తి గుర్తింపు లేకుండా ఆర్.టి.ఐ. వేయడం వల్ల చట్టబద్ధత అనేది లేకుండాపోతోంది..
ప్రభుత్వం కూడా ఈ దుర్వినియోగం నేపథ్యంలో కొన్ని చర్యలు తీసుకుంటోంది.. అందులో ఆర్.టి.ఐ. సవరణ చట్టం, 2019 ఒకటి.. ఇన్ఫర్మేషన్ కమిషనర్ల పదవీకాలం, వేతనం వంటి అంశాలను నియంత్రించింది. అయితే కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేంద్రానికి అధిక నియంత్రణ ఇచ్చింది, తద్వారా స్వతంత్రత తగ్గింది. కేంద్రం, రాష్ట్రాలు ఆర్.టి.ఐ. ని ఆన్లైన్లో తీసుకోవడానికి సదుపాయం కల్పించాయి. ఇక ఆర్.టి.ఐ. వేయకుండా, ప్రభుత్వ శాఖలు తాము స్వయంగా సమాచారం విడుదల చేయాలనే నిబంధన కూడా తీసుకుని వచ్చారు.. కానీ అది అమలులో నోచుకోవడం లేదు..
ఆర్.టి.ఐ. చట్టం ప్రజా పారదర్శకతకు ఆయుధం, కానీ పరిపాలనలో విఘాతం సృష్టించే స్థితికి చేరింది. ప్రభుత్వం స్వతంత్ర కమిషన్ల స్వేచ్ఛను తగ్గిస్తూ, సమాచార నియంత్రణ వాతావరణం సృష్టిస్తోంది. అసలు ఆర్.టి.ఐ. చట్టాన్ని తుడిచిపెట్టడానికి గత బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం ప్రయత్నం చేసి విఫలమైన విషయం తెలిసిందే.. కాగా కొంతమంది ఆర్.టి.ఐ. యాక్టివిటిస్టులు తమ జీవితాలను కోల్పోయారు.. అవినీతిని బయటపెట్టినందుకు హత్యలు కూడా జరిగాయి. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాద సూచికలుగా చెప్పవచ్చు..
దీనికి సంబంధించిన కొన్ని వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.. అడిగిన సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానా విధించబడింది..
నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉన్నతాధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్ జరిమానా విధించింది. సమాచార హక్కు చట్టం అమలులోనిర్లక్ష్యంపై కమిషన్ సీరియస్ అయ్యింది.. వారికి జరిమానాలు విధించింది.. బాగానే ఉంది కేవలం జరిమానాలు విధించడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని విశ్లేషకులు వాదిస్తున్నారు.. సరైన సమాచారం అందించని పక్షంలో సంబంధిత అధికారులను విధులనుండి బహిష్కరించాలి.. చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలి..


