ఎల్బీనగర్:
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికి న్యాయం చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి అన్నారు. సోమవారము చైతన్యపురిలోని శివాజీ విగ్రహం దగ్గర తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ డా. కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో వికలాంగుల పాత్ర ఆత్మ గౌరవం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014 సంవత్సరం నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు న్యాయం చేయాలని కాచం సత్యనారాయణ పోరాటం చేస్తున్నారని అన్నారు. అన్ని జిల్లాలు తిరిగి కమిటీలు వేశాడని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఉద్యమకారులందరిని మర్చిపోయాడని, కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర పదవులు ఇచ్చాడని అన్నారు. కాచం సత్యనారాయణ కూడా ఎమ్మెల్యే పదవి వరించాల్సి ఉందని, కానీ అది వేరే వాళ్లకు ఇచ్చాడని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని అన్నారు. మాజీ సీఎం కేసిఆర్ ఉద్యమకారులందరినీ చిన్నచూపు చూసి కుటుంబ పాలనే కొనసాగించాడని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఉద్యమకారులు పోరాటం చేయవలసిన అవసరం ఉండేది కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వికలాంగుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. తార్నాకలో కూడా మొదటి జెండా పట్టింది మేమే అని, మా కుటుంబంలో కూడా అమరుడు అయ్యాడని గుర్తు చేశారు.తెలంగాణ ఉద్యమకారులు అందరికీ కూడా ఈ ప్రభుత్వం లో న్యాయం జరుగుతుందని అన్నారు. గత వారంలో సెక్రటేరియట్ లో అన్ని పార్టీలతో కలిసి అఖిలపక్షం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎల్బీనగర్ కీలక పాత్ర పోషించిందని జైలుకు పోయిన వారు అమరులైన వారు ఎంతో మంది ఉన్నారని అన్నారు. అన్ని జేఏసీలు ఏకమై సకలజనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ సాధించామని అన్నారు.
అనంతరం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ, నాటి నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో ఎల్బీనగర్ నియోజకవర్గం కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సభ్యులు రంగారెడ్డి, పల్లె వినయ్ కుమార్,కూర రమేష్, కొత్త రవి, శ్రవణ్ కుమార్ గుప్తా, పురేందర్ నేత,
నర్సిరెడ్డి, వెంకట్ రెడ్డి, కొండ్ర శ్రీనివాస్, వికలాంగుల సంఘం నాయకులు ఆంజనేయులు, నాగభూషణం, రాంబాబా, వేణు గౌడ్, సుధాకర్, రాజ్యలక్ష్మి, వెంకటేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.


