- నల్సార్ ఘటనపై బీసీఐ వైఖరి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
- విద్యార్థుల ప్రశ్నించే హక్కును అణచివేయొద్దు
- వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్
రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి
హైదరాబాద్:
నల్సార్ విద్యార్థులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం, జంతర్ మంతర్ నిరసనలపై ఆయన చేసినట్లు నివేదించబడిన వ్యాఖ్యలు న్యాయం, ప్రజాస్వామ్యం, పౌర హక్కులపై తమకు ఆందోళన కలిగించాయని, సుమారు 450 మంది విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించి ఆహ్వానాన్ని పునఃపరిశీలించాలని కోరారని, ఇది న్యాయవ్యవస్థపై వ్యక్తిగత దూషణగా కాకుండా, ఒక ప్రజా అంశంపై విద్యార్థులు వ్యక్తం చేసిన అభిప్రాయంగా చూడాలని భావించడమే నేరమా అని, దీన్ని కారణంగా చూపుతూ, ఈ అభిప్రాయానికి స్పందించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొత్తం 2026 బ్యాచ్ విద్యార్థుల బార్ కౌన్సిల్ నమోదును నిలిపివేయడం తీవ్రంగా అభ్యంతరకరమని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోందన్నారు.ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ మాట్లాడుతూ, విద్యార్థులపై బీసీఐ వైఖరి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. బీసీఐ తొలుత నల్సార్ 2026 బ్యాచ్ మొత్తం నమోదును నిలిపివేయడంతో పాటు, ప్రచారాన్ని ప్రారంభించిన, నిర్వహించిన లేదా విద్యార్థులను ప్రేరేపించిన వారిపై వివరాలు కోరిందని, అనంతరం మెజారిటీ విద్యార్థులు ఎలాంటి తప్పు చేయలేదని గుర్తించి, వారందరికీ తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆర్టికల్ 14లోని సమానత్వ సూత్రాలను సంస్థలు గౌరవించాలన్నారు. శాంతియుతంగా భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో నేరం కాదన్నారు. విద్యార్థులు ప్రశ్నించడం, చర్చించడం, ఒక నిర్ణయాన్ని వ్యతిరేకించడం ప్రజాస్వామ్య సంస్కృతిలో భాగమన్నారు. అయితే చట్టవిరుద్ధ చర్యలకు ఎవరైనా పాల్పడితే వ్యక్తిగత బాధ్యత ఆధారంగా, పూర్తి న్యాయ ప్రక్రియతో చర్యలు తీసుకోవాలే తప్ప సామూహిక శిక్ష విధించకూడదన్నారు. న్యాయవ్యవస్థకు గౌరవం అవసరమే… అదే సమయంలో రాజ్యాంగం కల్పించిన ప్రశ్నించే హక్కుకు కూడా గౌరవం ఉండాలన్నారు. విద్యార్థుల గొంతును అణచడం కాదని, రాజ్యాంగ విలువలను కాపాడటమే నిజమైన న్యాయమన్నారు.


