చిగురింత.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన,కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దిష్టిబొమ్మల దహనం… బడంగ్ పేట్లో ఉద్రిక్తత
బడంగ్పేట్:
రాష్ట్ర శాసనసభాపతిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్ పేట్ సర్కిల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కించపరిచేలా మాట్లాడిన తీరుపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖంఢిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిల దిష్టిబొమ్మలను కాంగ్రెస్ కార్యకర్తలు నడిరోడ్డుపై దహనం చేశారు.
*అహంకార రాజకీయాలకు పరాకాష్ట: చిగిరింత నరసింహారెడ్డి
ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బడంగ్ పేట్ మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి గారు పాల్గొని బీఆర్ఎస్ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్న శాసనసభాపతిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి, దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత గౌరవం ఉన్న స్పీకర్ స్థానాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడటం క్షమించరాని నేరమని స్పష్టం చేశారు.
*ప్రజాపాలనను ఓర్వలేకే కుట్రలు
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం విజయవంతంగా ముందుకు వెళ్తుండడాన్ని, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి కుట్రపూరిత ఆరోపణలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు.
*బేషరతు క్షమాపణ చెప్పే వరకు ఆందోళనలు ఆగవు
శాసనసభాపతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా వ్యవహరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో హోరెత్తించారు.



