- నిరుపేద, మధ్యతరగతి స్వప్నాలకు సాకార రూపం..
- ఫాస్ట్ట్రాక్ పద్ధతిలో వేల ఎకరాల భూములకు శాశ్వత విముక్తి!
హైదరాబాద్:
దశాబ్దాలుగా సామాన్యులను పీడిస్తున్న 22/ఏ (22A) నిషేధిత భూముల జాడ్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన, వేగవంతమైన విధానంతో అడ్డుకట్ట వేసింది. భూమి ఉందన్న ఒక్క సాకుతో రిజిస్ట్రేషన్లను నిలిపివేసే సంప్రదాయానికి స్వస్తి పలికి, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార యంత్రాంగానికి జారీ చేసిన స్పష్టమైన ఆదేశాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
*పారదర్శక పాలనకు ప్రతీకగా రెవెన్యూ యంత్రాంగం
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు మరియు సబ్-రిజిస్ట్రార్లను సమన్వయం చేస్తూ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యక్ష పర్యవేక్షణ ఫలించింది. నార్లపల్లి, కూకట్పల్లి అడ్డగుట్ట సొసైటీ, మూసాపేట్, గుండ్లపోచంపల్లి తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన వేలాది ప్లాట్లు, నివాస స్థలాలకు నిషేధిత జాబితా నుంచి పూర్తి స్థాయిలో విముక్తి లభించింది. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన దరఖాస్తుదారులు కేవలం వారాల వ్యవధిలోనే తమ ఆస్తులకు చట్టబద్ధమైన హక్కును పొందడం విశేషం.
*చట్టబద్ధ రక్షణే ధ్యేయం
- సమగ్ర పరిశీలన: హక్కుదారుల వద్ద ఉన్న పత్రాలు, ప్రభుత్వ రికార్డులు, వాస్తవ పరిస్థితులను బేరీజు వేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
- ఫీజుల రీఫండ్: రిజిస్ట్రేషన్కు అవకాశం లేని పక్షంలో నిబంధనల ప్రకారం ముందస్తుగా చెల్లించిన రుసుమును దరఖాస్తుదారులకు తక్షణమే వెనక్కిచ్చేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
- ప్రజల హక్కుల పరిరక్షణ: ప్రభుత్వ ఆస్తులకు ఎటువంటి విఘాతం కలగకుండా, సామాన్యుల చట్టపరమైన హక్కులను వందశాతం కాపాడటమే ఈ ప్రభుత్వ మూలమంత్రమని స్పష్టమైంది.
“ప్రభుత్వం తీసుకున్న సకాలపు చర్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. దశాబ్దాల సమస్యను చిటికెలో పరిష్కరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.” — భూ యజమానులు మరియు లబ్ధిదారులు


