ఈనెల 26న నియామక ఉత్తర్వులు..
అన్నిరకాల ఏర్పాట్లు చేసిన అధికారులు..
మొత్తం 8,084 మంది ఎన్నిక..
తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలు పొందిన వారికి నవంబర్ 26వ తేదీన నియామకపత్రాలు అందజేసే అవకాశముంది. ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. టీజీపీఎస్సీ గ్రూప్-4 ఫలితాలు ఈనెల14న విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 8,084 మంది అభ్యర్థులు ఈ గ్రూప్-4 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే.. ఇరిగేషన్శాఖలో కొత్తగా 49 మంది జూనియర్ అసిస్టెంట్లు(జేఏ) రానున్నారు. ప్రభుత్వం గ్రూప్-4 ఫలితాలను ఇటీవలే వెల్లడించింది. వీటిలో ఇరిగేషన్శాఖకు 50 పోస్టులు మంజూరయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుతం 49 పోస్టులకే అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆ జాబితాను ఇరిగేషన్శాఖ అధికారులకు పంపించింది. అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 17 మంది జూనియర్ అసెస్టింట్లను (జేఏ) కేటాయించడం విశేషం.
కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి పూర్తికావస్తున్న నేపథ్యంలో నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రూప్ 4 అభ్యర్ధులకు నియామక పత్రాలు అందజేయనున్నట్లు ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజున ప్రజా విజయోత్సవాలు ప్రారంభించి.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజుతో ముగియనున్నాయి. ఈ మేరకు ప్రణాళిక కూడా రూపొందించారు. మొత్తం 25 రోజులపాటు విజయోత్సవాలు జరగనున్నాయి.