ఇండియన్ అమెరికన్కు కీలక బాధ్యతలు అప్పగించిన ట్రంప్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈనేపథ్యంలో తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తన పరిపాలన టీమ్లోకి ఒక్కొక్కరిని తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు భారత సంతతికి చెందిన వ్యక్తులకు కీలక పదవులు కేటాయించారు. తాజాగా కశ్యప్ పటేల్కు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. దేశంలోనే అత్యంత ముఖ్యమైన దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్గా పటేల్ను నియమించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
‘ఎఫ్బీఐ తదుపరి డైరెక్టర్గా కాష్ పటేల్ వ్యవహరిస్తునందుకు నేను గర్విస్తున్నా. కాష్ గొప్ప లాయర్, పరిశోధకుడు. దర్యాప్తులో దిట్ట. అమెరికాలో అవినీతి నిర్మూలనకు, న్యాయాన్ని గెలిపించేందుకు నిరంతరం శ్రమిస్తున్న అమెరికా ఫస్ట్ ఫైటర్. అమెరికా ప్రజల రక్షణలో ఆయన కృషి గొప్పది. ఆయన నియామకంతో ఎఫ్బీఐకి పునర్వైభవం తీసుకొస్తాం’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫాంలో వెల్లడించారు.
కశ్యప్ పూర్వీకులు గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతని తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. కాష్ తండ్రి, ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్లోని గార్డెన్ సిటీలో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం యూనివర్శిటీ కాలేజ్ లండన్లో న్యాయవిద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా కొలువు లభించలేదు. దీంతో మియామీ కోర్టుల్లో లాయర్గా వివిధ హోదాల్లో సేవలందించారు.