Monday, August 10, 2026
Google search engine
Homeతెలంగాణనల్సార్‌లో నిరసనల నిప్పులు:

నల్సార్‌లో నిరసనల నిప్పులు:

  • సీజేఐ పర్యటనను వ్యతిరేకిస్తూ 450 మంది విద్యార్థుల తిరుగుబాటు!
  • ప్రధాన న్యాయమూర్తి రాకపై రగులుతున్న లా వర్సిటీ.. డిగ్రీ పట్టాల స్వీకరణకు విద్యార్థుల నిరాకరణ
  • యూనివర్సిటీ ఉపకులపతికి భారీ సంఖ్యలో విద్యార్థుల సంతకాలతో లేఖ..
  • వాయిదా పడిన స్నాతకోత్సవం

హైదరాబాద్:

న్యాయ విద్యకు నిలయంగా, దేశంలోనే అగ్రగామిగా వెలుగొందుతున్న నల్సార్ లా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా భారత సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన తిరుగుబాటు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. న్యాయ వ్యవస్థ విధివిధానాలపై విశ్వాసం ఉంచాల్సిన భావి న్యాయవాదులే నేరుగా సర్వోన్నత న్యాయపీఠాన్ని ప్రశ్నిస్తుండటం విద్యావర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ఆహ్వానాన్ని నిరసిస్తూ 450 మంది విద్యార్థుల సమిష్టి లేఖ
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసేందుకు నల్సార్ యంత్రాంగం ఏర్పాట్లు చేసిన స్నాతకోత్సవానికి, భారత ప్రధాన న్యాయమూర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే, ఈ నిర్ణయం వెలువడిన క్షణం నుంచే విద్యార్థి లోకంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.
గత నెలలో ఢిల్లీ వేదికగా విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం జరిగిన ఆందోళనల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆ సందర్భంగా జరిగిన దాడులు, వాటికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వ్యవహరించిన తీరు పట్ల విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బాధితులైన విద్యార్థుల వాదనలను పరిగణనలోకి తీసుకోవడంలో, న్యాయం చేకూర్చడంలో అత్యున్నత న్యాయస్థానం అనుసరించిన సరళి రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అటువంటి వ్యక్తి చేతుల మీదుగా తమ డిగ్రీ పట్టాలు స్వీకరించడం నైతిక విలువలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ, ఏకంగా 450 మందికి పైగా విద్యార్థులు తమ సంతకాలతో కూడిన ఒక సంయుక్త వినతిపత్రాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతికి అందజేశారు.

*పునఃసమీక్షకు డిమాండ్.. వాయిదా పడిన వైనం
స్నాతకోత్సవానికి ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించాలన్న నిర్ణయాన్ని యాజమాన్యం తక్షణమే పునఃసమీక్షించాలని విద్యార్థులు తమ లేఖలో గట్టిగా డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన గనుక ముఖ్య అతిథిగా హాజరైతే, యూనివర్సిటీ ప్రాంగణంలో తీవ్ర నిరసనలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని వర్సిటీ వర్గాలకు స్పష్టం చేశారు. ఈ అనూహ్య పరిణామాలు, విద్యార్థుల నుంచి వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత కారణంగానే అనివార్యంగా స్నాతకోత్సవాన్ని వాయిదా వేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సున్నితమైన అంశంపై విద్యార్థి ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు యంత్రాగం సిద్ధమవుతున్నప్పటికీ, ఇప్పటివరకు విశ్వవిద్యాలయ అధికారిక వర్గాల నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ప్రజాస్వామ్య విలువలు, భావప్రకటన స్వేచ్ఛ పరిఢవిల్లాల్సిన లా యూనివర్సిటీలో జరుగుతున్న ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా న్యాయ నిపుణులను ఆలోచింపజేస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments