- రాజ్యాంగ స్ఫూర్తిని నీరు గారుస్తున్న కేంద్ర ప్రభుత్వం…
- క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బిజెపి విధానాలపై పోరాటాలు…
- సిఐటియు ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా రాస్తారోకో…
అమీన్ పూర్ :
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని,రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని,గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని సిఐటియు,రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా సోమవారం నాడు అమీన్ పూర్ మండలంలోని బీరంగూడ లో భారీ ర్యాలీ నిర్వహించి,ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా చేసి,రాస్తారోకో చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు పాండురంగారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు నర్సింహారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు కర్షకులు ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి సమస్యల పరిష్కారంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.దేశంలోని ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అదాని, అంబానీ,బడా పెట్టుబడిదారులకు సేవ చేస్తున్నారని అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన పోరాటాలు చేస్తుంటే నిర్బంధాలను ప్రయోగిస్తూ అణిచివేస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను యజమానుల తొత్తులుగా మార్చి కార్మికులను బానిసలుగా చేశారని అన్నారు.రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అనేక పోరాటాలు చేయడం జరిగిందని అన్నారు. గ్రామీణ పేదలకు పని కల్పించాలని ఉద్దేశంతో గత ప్రభుత్వం తెచ్చినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చారని అన్నారు. నిత్యవసర సరుకుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్న పట్టించుకోవడం లేదన్నారు. విద్యా ఉద్యోగాలు లేక యువత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే వారి సమస్యలను సానుకూలంగా స్పందించకుండా దౌర్జన్యంగా పార్టీలతో కొట్టి కేసులు పెట్టి అణచివేస్తున్నారని అన్నారు. మోడీ విధానాల పట్ల విసిగిపోయిన ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తున్నారని క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో ఆ ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాయిని లలిత, సునీత, సిఐటియు నాయకులు జార్జ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రదీప్, మణిరాజు,వీరస్వామి,జిలాని వివిధ పరిశ్రమల కార్మిక నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


