జవహర్నగర్:
సామాజిక సేవలో ముందుండే సుఖినోభవంతు ట్రస్ట్, పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ మరోసారి తమ సేవా తత్వాన్ని చాటుకున్నాయి. జవహర్నగర్ మున్సిపల్ పరిధిలోని చంద్రపురి కాలనీ, బాలాజీనగర్లో ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న నిరుపేద దివ్యాంగ వితంతువు వరలక్ష్మికి స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో కిరాణా షాపును ఏర్పాటు చేసి సోమవారం ప్రారంభించారు. సుఖినోభవంతు ట్రస్ట్ చైర్మన్ రత్నప్రభ, పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ భాను రెడ్డిలు కలిసి సుమారు రూ.20 వేల విలువైన కిరాణా సామగ్రిని అందించి వరలక్ష్మి స్వయంగా ఉపాధి పొందేలా సహకరించారు. ఈ విషయాన్ని వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ ట్రస్ట్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి సహాయం అందించారు. ఈ సందర్భంగా మెరుగు శివకృష్ణ ఆధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి కిరాణా షాపును ప్రారంభించారు. గతంలో కూడా ఈ ట్రస్ట్లు పేదలకు కుట్టుమిషన్లు, రైస్ బ్యాగులు, వికలాంగులకు వీల్చైర్లు, విద్యార్థులకు పుస్తకాలు అందించడంతో పాటు నిరుపేద కుటుంబాల వివాహాలకు పుస్తెమట్టలు, దశదిన కర్మలకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తనకు ఉపాధి కల్పించి ఆత్మవిశ్వాసాన్ని నింపిన మెరుగు శివకృష్ణ, రత్నప్రభ, భాను రెడ్డిలకు వరలక్ష్మి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుఖినోభవంతు ట్రస్ట్ సభ్యులు సత్యవతి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


