ఎల్బీనగర్
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG) ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం, సరూర్నగర్ నందు నిర్వహించబడుతున్న సరూర్నగర్ వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం 20 తేదీన ఎంపికల ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించబడ్డాయి.ఈ ఎంపికల ట్రయల్స్కు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి మొత్తం 136 మంది బాలురు మరియు 22 మంది బాలికలు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ ఎంపికల ప్రక్రియను శ్రీమతి ప్రవీణ లక్ష్మి (వాలీబాల్ కోచ్), రుషేందర్ (వాలీబాల్ కోచ్), శ్రీ వీరా రెడ్డి (వాలీబాల్ కోచ్), ఎన్. యశ్వంత్ కుమార్ (అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు), కె. కృష్ణ ప్రసాద్ (వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధి), శ్రీమతి ఎస్. స్వప్న (అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి), శ్రీమతి రమాదేవి (వాలీబాల్ అకాడమీ కోచ్), శ్రీమతి ఎస్. స్వర్ణలత (జిల్లా యువజన & క్రీడల అధికారి (DYSO) మరియు అడ్మినిస్ట్రేటర్, వాలీబాల్ అకాడమీ, సరూర్నగర్ తో పాటు అకాడమీ కోచ్లు మరియు సిబ్బంది సమక్షంలో పారదర్శకంగా నిర్వహించారు.ఎంపిక కమిటీ సభ్యులు ప్రతి క్రీడాకారుని శారీరక దారుఢ్యం, ఎత్తు, ఆట నైపుణ్యం, ఫిట్నెస్, సాంకేతిక ప్రతిభ, జట్టు సమన్వయం, క్రమశిక్షణ మరియు మొత్తం ప్రదర్శన ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించి, ట్రయల్స్కు హాజరైన అభ్యర్థులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వాలీబాల్ అకాడమీలో ప్రవేశానికి ఎంపిక చేశారు.ఈ సందర్భంగా జిల్లా యువజన & క్రీడల అధికారి మరియు వాలీబాల్ అకాడమీ అడ్మినిస్ట్రేటర్ శ్రీమతి ఎస్. స్వర్ణలత మాట్లాడుతూ, సరూర్ నగర్ వాలీబాల్ అకాడమీ రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అత్యున్నత స్థాయి శిక్షణ అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎంపిక కాలేని క్రీడాకారులు కూడా నిరుత్సాహపడకుండా నిరంతరం సాధన కొనసాగించి భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రతిభను కనబరచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపిక కమిటీ సభ్యులు, కోచ్లు, అకాడమీ సిబ్బంది, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


