కార్యక్రమంలో పాల్గొన్న మధుయాష్కీ గౌడ్..
ఎల్బీనగర్
మొఘల్ పాలకుల అరాచకాలు, దౌర్జన్యాలను ధైర్యంగా ఎదిరించి, గోల్కొండ కోటపై విజయతాంఛనంగా కాషాయ జెండా ఎగురవేసిన చారిత్రక పురుషుడు, బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఉద్ఘాటించారు. సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న నూతన సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్లో అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మధుయాష్కి గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్తో కలిసి ఈ చిత్ర టీజర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ చరిత్రలో విస్మరించబడిన యోధులను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అభిప్రాయపడ్డారు.
పాపన్న ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదని, ఆయన అందరివాడని వక్తలు కొనియాడారు. బహుజన పోరాట పటిమను చాటిచెప్పే సర్వాయి పాపన్న చారిత్రక విశేషాలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, సినిమా మరియు ఇతర దృశ్య మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. చారిత్రక యోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నేటి తరపు కర్తవ్యమని నేతలు స్పష్టం చేశారు.



