- ఏ.ఎం.సి దినేష్ సింగ్ అవినీతికి అడ్డం వస్తున్నాడని కుట్రపూరిత చర్యలు..
- డిప్యూటీ కమిషనర్ నియంతృత్వ పోకడలపై భగ్గుమన్న ఉద్యోగ వర్గాలు
హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చట్టాన్ని కాలరాస్తూ, స్వలాభం కోసం పదవులను అడ్డం పెట్టుకుని సాగిస్తున్న అరాచకాలు తారాస్థాయికి చేరాయి.
ఎల్బీనగర్ జోన్, సర్కిల్-14 మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్ పరిధిలోని హయత్నగర్ కార్యాలయంలో ప్రజాధనాన్ని స్వాహా చేస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అవినీతి అధికారుల బండారం బట్టబయలైంది. అవినీతిని, అక్రమాలను ప్రశ్నించిన నిజాయితీపరుడి గొంతును నొక్కేసేందుకు అధికార బలంతో సాగిస్తున్న కక్షసాధింపు చర్యలు ఇప్పుడు మున్సిపల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
*పాతికేళ్ళ నిజాయితీకి మున్సిపల్ ద్రోహం:
గత ఇరవై ఎనిమిదేళ్లుగా ఎలాంటి మచ్చలేకుండా, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ మరియు లైసెన్స్ ఆఫీసర్ జి. బాలకృష్ణ పట్ల సర్కిల్-14 డిప్యూటీ కమిషనర్ వ్యవహరించిన తీరు మున్సిపల్ వ్యవస్థ సిగ్గుతో తలదించుకునేలా ఉంది. సర్కిల్ పరిధిలో జరుగుతున్న పాలనాపరమైన లూటీలను, దొడ్డిదోవన సాగుతున్న అవినీతి బాగోతాలను బాలకృష్ణ నిర్భయంగా నిలదీశారు. తన అక్రమాలకు అడ్డొస్తున్నాడన్న అక్కసుతో, ఎలాంటి ఆధారాలు లేకుండా, శాఖాపరమైన నిబంధనలను తుంగలో తొక్కి ఆయన్ను ఏకపక్షంగా సరెండర్ చేస్తూ తుగ్లక్ నిర్ణయం తీసుకున్నారు.
జీహెచ్ఎంసీ సర్క్యులర్ బేఖాతర్.. నిబంధనలకు తిలోదకాలు:
ఉద్యోగుల బదిలీలు మరియు సరెండర్ల విషయంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం జారీ చేసిన స్పష్టమైన మార్గదర్శకాలను ఇక్కడ అపహాస్యం చేశారు. నాటి కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్ (నెం. 1957/ఎల్డబ్ల్యూఎస్/బి6/జీహెచ్ఎంసీ/2008, తేదీ: 21.01.2008) ప్రకారం, హెడ్స్ ఆఫ్ సెక్షన్స్ తమ ఇష్టానుసారంగా కిందిస్థాయి ఉద్యోగులను సరెండర్ చేయడానికి వీలే లేదు. ఉద్యోగిపై ఏవైనా ఆరోపణలు ఉంటే సీసీఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలే తప్ప, ఇలా పక్కనబెట్టడం నిబంధనల ఉల్లంఘన అవుతుంది. ఈ నిబంధనలను అడ్డుపెట్టుకుని కొందరు అధికారులు చేస్తున్న అక్రమాలకు హద్దు లేకుండా పోయింది.
*విజిలెన్స్ దర్యాప్తునకు డిమాండ్:
ప్రజాధనాన్ని కొల్లగొడుతూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న హయత్నగర్ సర్కిల్-14 డిప్యూటీ కమిషనర్ మరియు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల వెనుక ఉన్న అక్రమ సంబంధాలపై సమగ్ర విచారణ జరగాలని భాగ్యనగర్ మున్సిపల్ ఉద్యోగుల యూనియన్ (బీఎంఈయూ – బీఎంఎస్) గట్టిగా డిమాండ్ చేసింది. ఈ అన్యాయమైన సరెండర్ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో మున్సిపల్ కార్మికులు మరియు ఉద్యోగులను ఏకం చేసి రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. అవినీతికి పాల్పడి, బాధ్యత గల ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్న ఆ కిరాతక అధికారులపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంఘం జనరల్ సెక్రటరీ టి. కృష్ణ డిమాండ్ చేశారు. నిబంధనలను కాలరాస్తున్న ఈ అవినీతి తిమింగలాలపై జోనల్ కమిషనర్ ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.


