ఎల్బీనగర్:
మహేశ్వరం నియోజకవర్గం భారాస పార్టీ మహిళలు, సీనియర్ నాయకులు సోమవారం ఎన్టీఆర్ నగర్ చౌరస్తా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దానిలో భాగంగా రోడ్డుమీద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు సాకుతో పేదింటి ఆడబిడ్డల భరోసాను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు.కళ్యాణ లక్ష్మి అంశంలో హైకోర్టులో కౌంటర్ వేయకుండా కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు.ముఖ్యమంత్రి,మంత్రుల అవినీతి అంశాల్లో కోట్ల రూపాయలు చెల్లించి ప్రైవేటు లాయర్లను పెట్టుకునే ప్రభుత్వం ఈ అంశంలో ఎందుకు కౌంటర్ వెయ్యలేదని అన్నారు.తెలంగాణ ఆడబిడ్డలు,వారి కుటుంబాల తరఫున బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తుందని అన్నారు.ఆడబిడ్డలు తులం బంగారం అడుగుతున్నందుకే పూర్తిగా కళ్యాణలక్ష్మిని ఎత్తి వేసే కుట్ర చేస్తుందని అన్నారు.పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి,ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహిళలు మండిపడ్డారు.హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని,తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు,ఆత్మగౌరవంతో ముడిపడిన కార్యక్రమాలని పేర్కొన్నారు.తెలంగాణ ఏర్పడిన వెంటనే పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి ఎంతటి ఆర్థిక భారమో గుర్తించిన కేసీఆర్ 2014 అక్టోబర్ 2న ఈ పథకాలను ప్రారంభించారని గుర్తుచేశారు. రూ. 51 వేల ఆర్థిక సహాయంతో ప్రారంభమైన ఈ పథకాన్ని దశలవారీగా రూ.75,116కు,అనంతరం రూ.1,00,116కు పెంచారని తెలిపారు.కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందిందన్నారు. కోవిడ్ వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. అయితే ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి దానినే రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని భారాస పార్టీ మహిళలు విమర్శించారు. కళ్యాణలక్ష్మి కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఆడబిడ్డ ఇప్పుడు ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కూడా డిమాండ్ చేస్తుండటంతో ఆ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్హులైన లబ్ధిదారులే చెబుతున్నారని అన్నారు. పెళ్లిళ్లు జరిగి చాలా కాలం గడిచినా, కొందరికి పిల్లలు పుట్టినా కూడా తమకు రావాల్సిన కళ్యాణలక్ష్మి సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని ధ్వజమెత్తారు.చాలా కాలం తర్వాత ఆమోదం పొందిన దరఖాస్తులకు సంబంధించిన చెక్కులు కూడా పూర్తిస్థాయిలో పంపిణీ కాకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని అర్హత ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గంలోనీ ఆర్కేపురం, ఎన్టీఆర్ డివిజన్ల నేతలు శ్రీధర్ రావు, మురుకుంట్ల అరవింద్ శర్మ, నగేష్, సాజిద్, భారాస పార్టీ మహిళా నాయకురాల్లు, తదితరులు పాల్గొన్నారు.


