- రెసిడెన్షియల్ ముసుగులో కమర్షియల్ దందాలు.. నిద్రమత్తులో యంత్రాంగం!
- హయత్ నగర్ కెప్టెన్ కుక్ హోటల్ ప్రక్కన భారీ అక్రమ నిర్మాణానికి అండగా గల్లి నాయకుల సుపారీ గ్యాంగ్ అండదండలు: అధికారులు లాలూచీ,యదేచ్చగా పనులు కొనసాగింపు..
- సెల్లార్ టైంలో నెలల క్రితం రాతపూర్వక ఫిర్యాదులు, దినపత్రికల్లో వార్తా కథనాలు వచ్చినా , నెలలు గడుస్తున్నా చర్యలు శూన్యం..
- హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్ అజ్మీరా స్వామి పాత్రపై ముసరుతున్న అనుమానాలు..
- మున్సిపల్ ఖజానాకు గండి కొడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్.
- ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో , ఎం.ఎం.సి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టి సారించాలి..
ఎల్బీనగర్:
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్ హయత్ నగర్ సర్కిల్ 14 లో అక్రమ కట్టడాల పర్వం అడ్డగోలుగా సాగుతోంది. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గల అధికారులే అక్రమార్కులకు కొమ్ముకాస్తుండటంతో, ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ సాగుతున్న ఈ అనధికార నిర్మాణాలపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారుల మౌనం, కాలయాపన తీరు చూస్తుంటే రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ దందా సాగుతోందన్న బహిరంగ చర్చ జోరుగా సాగుతోంది.
హయత్ నగర్ సర్కిల్14 పరిధిలోని విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని, కెప్టెన్ కుక్ హోటల్ పక్కన జరుగుతున్న భారీ వాణిజ్య నిర్మాణం ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. సర్వే నంబర్ 263, ప్లాట్ నంబర్ 23లో జరుగుతున్న ఈ అక్రమ కట్టడంపై అధికార యంత్రాంగం ఉదాసీన వైఖరి అవలంబించడం విస్మయానికి గురిచేస్తోంది.
ప్లాట్ నంబర్ 23, సర్వే నంబర్ 263: సాగుతున్న బరితెగింపు ఇలా..

- రెసిడెన్షియల్ ముసుగులో కమర్షియల్ దందాలు: నిబంధనల ప్రకారం 400 గజాల స్థలాన్ని రెండు భాగాలుగా విభజించి, ఒక్కో ప్లాట్కు 200 గజాల చొప్పున జీ ప్లస్ టు (G+2) నివాస గృహాల అనుమతులు పొందారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా వాణిజ్య అవసరాల కోసం బహుళ అంతస్తుల భారీ భవనాన్ని నిర్మిస్తూ చట్టాన్ని శాసిస్తున్నారు.
- భారీ పన్ను ఎగవేత – మార్టిగేజ్ మోసం:
వాణిజ్య భవనాలకు చెల్లించాల్సిన భారీ అభివృద్ధి రుసుములు, మున్సిపల్ ఫీజులను ఎగవేయడమే కాకుండా, మున్సిపాలిటీకి కేటాయించాల్సిన మార్టిగేజ్ స్థలాన్ని కూడా స్వాహా చేసి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
- ప్రాణాల మీదకు తెస్తున్న సెల్లార్ తవ్వకాలు: ఎలాంటి ఇంజనీరింగ్ ప్రమాణాలు పాటించకుండా, భారీ యంత్రాలతో అతిలోతైన సెల్లార్ను తవ్వడంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్ల పునాదులు దెబ్బతిని ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది.
*సెట్బ్యాక్లు గాలికి – ఫుట్పాత్ కబ్జా:
జాతీయ రహదారి నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి, కనీస సెట్బ్యాక్ వదలకుండా రోడ్డు స్థలాన్ని ఆక్రమించారు. పాదచారులు నడిచే ఫుట్పాత్ను సైతం కబ్జా చేసి నిర్మాణ సామగ్రిని నిల్వ చేయడం యంత్రాంగ నిర్లక్ష్యానికి పరాకాష్ట.
*ఫిర్యాదులు చేసి నెలలు గడుస్తున్నా.. స్పందించని అధికారులు!
ఈ భారీ అక్రమ కట్టడంపై స్థానికులు ఆధారాలతో సహా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, మరియు హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ చర్యలు లేవు. కేవలం నోటీసుల పేరుతో కాలయాపన చేస్తూ, అక్రమార్కులకు అండగా మారుతున్నారనే ఆరోపణలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.
క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండా, అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయకుండా స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులకు, సదరు భవన యజమానులకు మధ్య కుదిరిన చీకటి ఒప్పందాలే ఇందుకు కారణమని ప్రజలు మండిపడుతున్నారు.
*పెను ముప్పు పొంచి ఉన్నా మొద్దునిద్ర వీడని యంత్రాంగం!
హైవేను ఆనుకొని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ భవనం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ట్రాఫిక్ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, సరైన సెట్బ్యాక్లు లేకపోవడం, అగ్నిప్రమాద నివారణ చర్యలు శూన్యం కావడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయే దుస్థితి ఏర్పడుతుంది.
*ఉన్నతాధికారులు ఎప్పుడు స్పందిస్తారు …!
ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు:
- హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అజ్మీరా స్వామి నిర్లక్ష్య వైఖరిపై విచారణ జరపాలి.
ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో (ఐ.ఏ.ఎస్), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి (ఐ.ఏ.ఎస్) తక్షణమే స్పందించి సర్వే నంబర్ 263, ప్లాట్ నంబర్ 23లోని అక్రమ నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలి.
ఈ అవినీతి తంతుకు సహకరిస్తూ, కాలయాపనకు పాల్పడుతున్న బాధ్యులైన టౌన్ ప్లానింగ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్.




