పుట్టినరోజు చూడటం ద్వారా సీనియారిటీ చూడటం ఏమిటి..?
గత సర్వీసును చూడటం లేదని ఆరోపణలు..
పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూ ల్యాంకనం విధులను ఇంటర్బోర్డు లెక్చరర్లకు కేటాయిస్తుంది. విధుల కేటాయింపులో సీనియారిటీ ఆధారంగా డ్యూటీలు వేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఇంటర్బోర్డు తీసుకున్న ఓ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు జగిత్యాల జిల్లాలోని ఒక వ్యక్తి ప్రభు త్వ జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్. ఆయన 2000లో కాంట్రాక్టు లెక్చరర్గా చేరి, 23 ఏండ్ల పాటు విధులు నిర్వహించారు. శ్రీనివాస్ సీనియర్ కావడంతో అతడికి పరీక్షల నిర్వహణలో కస్టోడియన్, సిట్టింగ్ స్కాడ్, ఫ్లయింగ్ స్కాడ్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ డ్యూటీలు చేశారు. 2023 మేలో కేసీఆర్ హయాంలో సర్వీసును క్రమబద్ధీకరించారు.
ఇప్పుడు కూడా కీలక విధులు కేటాయిస్తారని భావించారు. కానీ క్రమబద్ధీకరణ అయిన లెక్చరర్లకు సంబంధించి గత సర్వీసును పరిగణలోకి తీసుకోవడం లేదని అధికారులు చెప్తున్నారు. రెగ్యులరైజ్ ద్వారా లెక్చరర్లు అయిన వాళ్లలో పుట్టిన తేదీ ఆధారంగా సీనియారిటీని గుర్తిస్తున్నట్టు వెల్లడించారు. ఉద్యోగంలో అనుభవం ద్వారా సామర్థ్యం వస్తుంది కానీ.. డేట్ ఆఫ్ బర్త్ చూడడమేంటని ఇలాంటి చాలా మంది లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు లెక్చరర్ల సీనియార్టీని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రూపొందించామని జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నారాయణను తెలిపారు. ఆదేశాలు చూపించాలని కోరగా, జూమ్ మీటింగ్లో మౌఖికంగా ఆదేశించారని, రాతపూర్వకంగా, ప్రొసీడింగ్స్ ఏమీ ఇవ్వలేదని స్పష్టంచేశారు. జూమ్ మీటింగ్కు సంబంధించిన మినట్స్ ఇవ్వాలని కోరగా, ఎలాంటి మినిట్స్ను పంపించలేదని వివరించారు.