5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతి..
ఉదయం 9 మింక్జో 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు..
మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం 5-30 వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు..
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారు. మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షల్లోను ఐదు నిమిషాల సడలింపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోను ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తామని ఇంటర్బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఉదయం 9.05 గంటలు, మధ్యాహ్నం 2.35 గంటల తర్వాత వచ్చిన వారిని పరీక్షకు అస్సలు అనుమతించరు. అయితే గురువారం ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 29తో ముగుస్తాయి. ఈ సారి 4.2లక్షల విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, రాష్ట్రవ్యాప్తంగా 892 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్లు బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య వెల్లడించారు.