మిస్ ఇండియా 2023 టైటిల్ విజేత..
భారత్ కు చెందిన మోడల్ నందిని గుప్తా..
కొత్తతరం మహిళలో నందిని ఒక ప్రత్యేకం..
ఎంతో మంది యువతులకు ఈమె ఆదర్శం..
నందిని గుప్తా భారత్కు చెందిన ఓ మోడల్. ఆత్మవిశ్వాసం, అందం, కృషి పట్టుదలతో ఫెమినా మిస్ ఇండియా-2023 టైటిల్ని గెలిచింది. ప్రస్తుతం మిస్వరల్డ్ పోటీల్లో టాప్ మోడల్ చాలెంజ్ విజేతగా నిలిచి అంతర్జాతీయంగా భారత్ గర్వపడేలా చేసింది. తమ కలలను నిజం చేసుకునే ధైర్యం ఉన్న భారతదేశంలోని కొత్త తరం మహిళలలో నందిని గుప్తా ఒకరు. మిస్ ఇండియా నుంచి మిస్ వరల్డ్ టాప్ మోడల్ ఛాలెంజ్కు ఆమె ప్రయాణం అందాల పోటీల్లో రాణించాలన్న యువతులకు ప్రేరణగా నిలుస్తున్నది. మిస్ వరల్డ్ గెలిచిన తర్వాత నటనతో పాటు ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్రవేసిన ప్రియాంక చోప్రాను ప్రేరణగా తీసుకున్నట్లు నందిని గుప్తా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నందిని గుప్తా ఎవరు ? ఇప్పటి వరకు అందాల పోటీల్లో ఆమె ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం..
నందిని గుప్తా 2003 సెప్టెంబర్ 13న రాజస్థాన్లోని కోటాలో జన్మించారు. ఆమె వయస్సు 21 సంవత్సరాలు. ముంబయిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో విద్యనభ్యసించింది. వృత్తిరీత్యా మోడల్ అయిన నందిని ఆ తర్వాత అందాల పోటీల్లోనూ రాణించింది. 2023లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని నందిని గుప్తా గెలుచుకుంది. రాజస్థాన్కు చెందిన నందిని చిన్నప్పటి నుంచి మిస్ ఇండియా కావాలని కలలు కన్నది. ఆమె తన ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సామాజిక సమస్యలపై అవగాహనతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకొని టైటిల్ను సాధించింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భారత్ తరఫున పాల్గొంటున్నది. నందిని టాప్ మోడల్ చాలెంజ్లో అద్భుత ప్రదర్శన ఇచ్చింది.
ఈ చాలెంజ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీదారులు ర్యాంప్ వాక్, స్టయిలింగ్, నైపుణ్యం ఆధారంగా పోటీదారులను ఎంపిక చేయగా.. నందిని గుప్తా ఆసియా ఓషియానా విజేతగా ఎంపికయ్యారు. టాప్ మోడల్ ఛాలెంజ్ రెండు రౌండ్లలో జరిగింది. నందిని భారతీయ సంస్కృతిని చాటిచెప్పి.. న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. మిస్ వరల్డ్ వంటి ప్రతిష్టాత్మక పోటీలో భారతదేశం నుంచి టాప్ మోడల్ ఛాలెంజ్ను గెలుచుకోవడం గొప్ప గౌరవం. ఈ విజయం నందిని ఆత్మవిశ్వాసం, ఫ్యాషన్ సెన్స్, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది అంతర్జాతీయ ఫ్యాషన్, అందం పరిశ్రమలో భారతదేశం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసింది.