ప్యాట్నీ, రసూల్ పూరా, చికోటి గార్డెన్స్ ప్రాంతాల్లో పర్యటన..
ప్రజావాణిలో నాలాల కబ్జాలపై ఫిర్యాదులు..
నాలాల కబ్జాలపై హైడ్రా దృష్టి పెట్టింది. సోమవారం ప్రజావాణిలో నాలాల కబ్జాలపై ఫిర్యాదులను అందుకున్న హైడ్రా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. జీహెచ్ ఎంసీ, ఇరిగేషన్, ఎస్.ఎన్.డీ.పీ. ప్రాజెక్ట్ అధికారులతో పాటు కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ తో కలసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ముందుగా హస్మత్పేట, పికెట్ నాలాలను పరిశీలించారు. ప్యాట్నీ వద్ద 17 మీటర్ల వెడల్పుతో ఉన్న నాలా పై భాగంలో 150 మీటర్ల మేర కేవలం ఆరేడు మీటర్లకే పరిమితం అయినట్టు గుర్తించారు. దీంతో మహేంద్ర హిల్స్, పికెట్, జేబీఎస్, బాలంరాయ్, విమాన్నగర్ తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయని చెబుతూ.. పాత చిత్రాలను స్థానికులు చూపించారు. ప్యాట్నీ వద్ద ఇటీవల కాలంలో కాలువను 17 మీటర్ల మేర విస్తరించినా హస్మత్పేట, పికెట్ నాలాలు కలిసిన చోట కుంచించుకుపోవడాన్ని స్థానికులు చూపించారు. నాలా కబ్జాలకు గురి కావడంతో వేలాది ఇండ్లు ప్రతిసారి నీట మునుగుతున్నాయని వాపోయారు. ఈ మేరకు కంటోన్మెంట్ అధికారులకు గతంలో ఫిర్యాదు చేశామని.. హైడ్రాకు గత సోమవారం ఫిర్యాదు అందజేశామన్నారు. నగరంలో నాల పరిస్థితిపై కిర్లాస్కర్ కమిటీ, కిర్లోస్కర్ కమిటీ, వోయంట్స్ కమిటీ నివేదికలతో పాటు, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్.ఆర్.ఎస్.సి. శాటిలైట్ చిత్రాలను పరిశీలించి చర్యలు
తీసుకుంటామన్నారు.
చికోటీ గార్డన్స్లోనూ అదే పరిస్థితి :
ప్రకాష్నగర్ మెట్రో స్టేషన్ వద్ద వరద మప్పు అందరికీ తెలిసిందే.. 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం ప్రకాష్నగర్ మెట్రో స్టేషన్తో పాటు.. చికోటీ గార్డెన్స్ ప్రాంతాలు నీట మునిగిన దృశ్యాలు అందరికీ తెలిసినవే. ఇక్కడ 6 మీటర్ల వెడల్పులో ఉన్న వరద కాలువ కొన్ని చోట్ల 4.5 మీటర్ల మేర కబ్జా అయ్యిందని స్థానికులు కమిషనర్కు చూపించారు. కొన్ని చోట్ల నాలాను ఇష్టానుసారం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డైవర్ట్ చేశారని ఫిర్యాదు చేసారు. దీంతో అపార్ట్మెంట్లు కూడా నేత మునుగుతున్నాయని వాపోయారు. ప్రకాష్నగర్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో 1.5 మీటర్లకే పరిమితమవ్వడమే కాకుండా.. చికోటీ గార్డెన్స్లో మొత్తం కాలువ పూడుకుపోవడంతో వరదనీరు సాఫీగా వెళ్లని తీరును స్థానికులు వివరించారు. 5 సెంటీమీటర్ల మేర వర్షం పడినప్పడు తమ అపార్టుమెంట్లు, ఇళ్లు ఎలా నీట మునిగాయో సెల్ఫోన్లలో ఫొటోలను, వార్తలను చూపించి కబ్జాలను తొలగించాలని కోరారు. అప్పటికప్పుడే జీహెచ్ ఎంసీ, ఇరిగేషన్, హైడ్రా అధికారులతో కమిషనర్ చర్చించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ యిచ్చారు.