దాడుల్లో భారీగా డ్రగ్స్, నగదు స్వాధీనం..
వివరాలు వెల్లడించిన న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య..
డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ యాంటీ-నారోటిక్స్ బ్యూరో దాడులు చేపట్టి, భారీగా డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఆశాఖ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిపిన దాడులు, స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలను ఆయన శనివారం మీడియాకు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలో కల్తీకల్లు తాగి 90మందికి పైగా దవాఖానలో చేరిన ఘటనపై స్పందించిన టీజీ న్యాబ్.. నిజామాబాద్ జిల్లాలోని 104గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు.
యువతకు క్రీడాసామగ్రి పంపిణీ చేసి, డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములను చేశామని పేర్కొన్నారు. రెండు డ్రగ్స్ తయారీ కేంద్రాలపై సోదాలు చేపట్టి, భారీగా అల్ఫజోలం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గోవాలోని పర్రా ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి ‘లివియో’ అనే పెడ్లర్ను పట్టుకుని, అతని వద్ద కొకైన్, ఎండీఎంఏ, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. పెడ్లర్ ద్వారా హైదరాబాద్, బెంగళూరు, కేరళలోని 40మందికి పైగా డ్రగ్స్ సరఫరా అయినట్టు గుర్తించి.. వారి కోసం వేట మొదలు పెట్టినట్టు సందీప్శాండిల్య వివరించారు.
డీజే ఆపరేటర్లపై టీజీన్యాబ్ ప్రత్యేక దృష్టి సారించిందని సందీప్ శాండిల్య తెలిపారు. ఈ క్రమంలో కాకర్లమూడి స్వదీప్ అలియాస్ డీజే స్వాడ్ అనే డీజే.. హైదరాబాద్లో సంపన్నులైన యువతను డ్రగ్స్కు బానిసలుగా మార్చినట్టు గుర్తించామని వెల్లడించారు. అతడు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చేవాడని పేర్కొన్నారు. థానేలో ఉండే డీజే వన్ష్ ఠక్కర్ కూడా గోవా, బెంగళూరు, విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ.. డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్నట్టు తమ విచారణలో వెల్లడైందని వివరించారు.
ఇటీవల గోవాలో దాడులు చేపట్టి రూ.1.64కోట్ల విలువైన డ్రగ్స్, రూ.50లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఉత్తమ్సింగ్, రాజుసింగ్, మహేందర్ ప్రసాదే ఆధ్వర్యంలో హవాలా మార్గంలో ప్రతి రెండురోజులకు రూ.50లక్షల లావాదేవీలు జరుగుతున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. నిరుడు నైజీరియా బ్యాంకుల్లోకి రూ.150 కోట్లకుపైగా లావాదేవీలు జరిగినట్టు సందీప్ శాండిల్య వెల్లడించారు.