రెండు ఇంజన్లు శక్తి కోల్పోయి ఉండొచ్చని ప్రాథమిక అంచనా..
పైలట్ ‘మేడే’ కాల్ చేసినట్లు సమాచారం..
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటన గురువారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. విమానంలో మొత్తం 242 మంది ఉండగా, ప్రమాదానికి పక్షి ఢీకొనడమే కారణమై ఉండొచ్చని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి ప్రయాణికులతో బయలుదేరింది. విమానంలో 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం ఎయిర్ పోర్టు సమీపంలో కూలిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై నిపుణులు స్పందిస్తూ, టేకాఫ్ సమయంలో విమానానికి పక్షి ఢీకొని ఉండవచ్చని, దాని కారణంగా విమానం టేకాఫ్కు అవసరమైన సరైన వేగాన్ని, ఎత్తును అందుకోలేక ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని ఎన్డీటీవీకి తెలిపారు.
విమానయాన రంగ నిపుణుడు, మాజీ సీనియర్ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ మాట్లాడుతూ, “ప్రాథమికంగా చూస్తే, ఇది కొన్ని పక్షులు ఢీకొన్న ఘటనలా కనిపిస్తోంది. దీనివల్ల రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయి ఉండవచ్చు. టేకాఫ్ సజావుగానే జరిగింది. అయితే, గేర్లను పైకి తీసుకునే లోపే విమానం కిందికి దిగడం ప్రారంభించింది. ఇంజన్లు శక్తిని కోల్పోయినప్పుడు లేదా విమానం పైకి లేచే శక్తిని కోల్పోయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అసలు కారణం దర్యాప్తులో తేలుతుంది” అని వివరించారు.
“దృశ్యాలను బట్టి చూస్తే టేకాఫ్ ఎలాంటి అవాంతరాలు లేకుండానే జరిగినట్లుంది. విమానం నియంత్రిత పద్ధతిలోనే కిందకు వచ్చింది. పైలట్ ‘మేడే’ కాల్ ఇచ్చారు, అంటే అది అత్యవసర పరిస్థితి అని అర్థం” అని నొక్కి చెప్పారు.