ప్రభుత్వం జానపద కళాకారుల కోసం జానపద అకాడమీ ఏర్పాటుచేయాలి
తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పమ్మి రవి
ఖమ్మంలో ఘనంగా జానపద దినోత్సవ వేడుకలు
అంతరించిపోతున్న జానపద కళలను బతికించాలని, జానపద కళాకారుల కోసం ప్రత్యేక జానపద అకాడమీని ఏర్పాటుచేయాలని తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పమ్మి రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవనంలో శనివారం జానపద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం, కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జానపద కళాకారులు కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు పోలూరి రాము అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పమ్మి రవి లు ముఖ్య అతిథులుగా విచ్చేసి వారు మాట్లాడుతూ.. జానపద కళాకారులకు ప్రభుత్వం తక్షణమే జానపద అకాడమీ ఏర్పాటుచేసి అంతరించిపోతున్న జానపద కళలను బతికించాలని కోరారు. 1848 సంవత్సరంలో మిలియన్ థామస్ ఫోక్ లిటరేచర్ అనే పదాన్ని కనుగొని జానపద దినోత్సవంగా ప్రకటించారు. ఆగస్టు 22ను ప్రపంచ జానపద దినోత్సవంగా ప్రకటించి అన్ని జిల్లాలలో జానపద జాతరను నిర్వహించాలని ప్రభుత్వానికి విన్నవించారు. కాంగ్రెస్ సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షులు వంగపండు పుల్లారావు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారులు నంద్యాల నాగేశ్వరరావు, కొచ్చర్ల గురవయ్య, కర్ష పుల్లయ్య, అద్దంకి నరసింహారావు, బొడ్డు నాగేశ్వరావు, పెద్దపాక విజయ్, డప్పు శ్రీకాంత్, డోలక్ నరేష్, ఉపేందర్, వంశీ బాయ్ తదితరులు పాల్గొన్నారు.


