- సర్ ప్రక్రియలో బిజీగా ఉన్న రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది…
- అర్హులకు మరో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి
- ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి విజ్ఞాపన
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో పేదలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులకు చేయూతగా నిలుస్తున్న చేయూత పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన నేపథ్యంలో, అర్హులైన ప్రతి ఒక్కరికీ దరఖాస్తు చేసుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి.ప్రస్తుతం రాష్ట్రంలో సర్ (Special Intensive Revision) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఎన్నికల సంబంధిత పనుల్లో తీవ్రంగా నిమగ్నమై ఉన్నారు. దీంతో సాధారణ పరిపాలనా పనులతో పాటు పెన్షన్ దరఖాస్తులపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం, వారికి అవసరమైన సహాయం అందించడం కొంత కష్టతరంగా మారింది.మరోవైపు వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, నిరుపేదలు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడంతో చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోలేకపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు స్వయంగా మీ-సేవ కేంద్రాలకు వెళ్లడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు లేదా కనీసం మరికొంత అదనపు సమయం వరకు చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును పొడిగిస్తే, అర్హులైన అనేకమంది పేదలకు ప్రయోజనం చేకూరుతుంది.కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును పొడిగించాలి.దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులకు మరో అవకాశం కల్పించాలి. సర్ ప్రక్రియ కారణంగా ఏర్పడిన పరిపాలనా రద్దీని దృష్టిలో ఉంచుకోవాలి. వృద్ధులు, వికలాంగులు, మహిళలకు ప్రత్యేక సహాయం అందించేలా అధికారులను ఆదేశించాలి.గతంలో దరఖాస్తు చేసుకున్న అర్హుల దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. “ప్రభుత్వ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి.గడువు, అవగాహన లోపం లేదా పరిపాలనా పనుల రద్దీ కారణంగా ఒక్క అర్హుడు కూడా నష్టపోకూడదు” అనే ఉద్దేశంతో చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును పొడిగించాలని మహిళలు, వృద్ధులు, వికలాంగులు మరియు పేదల తరఫున ముఖ్యమంత్రిని వినమ్రంగా కోరుతున్నారు.


