తెలంగాణ శాసనసభ సాక్షిగా నిరుద్యోగుల ఆవేదన వ్యక్తపరిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు పోలీస్ కమిషనరేట్లలో ఉద్యోగ నియామక ప్రకటనపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి కోరారు. శాసనసభ సమావేశాలలో భాగంగా జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ కీలక అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలన్నింటిలోనూ పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడినప్పటికీ, రాజధాని ప్రాంతంలో మాత్రం ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
*ఏళ్ల తరబడి నిరీక్షణ
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ (మల్కాజ్గిరి), మరియు నూతనంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్సిటీ కమిషనరేట్ల పరిధిలో వేలాది మంది యువతీయువకులు ఏళ్ల తరబడి పోలీసు ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రేయింబవళ్లు కష్టపడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులలో తాజా జాప్యం తీవ్ర నిరుత్సాహాన్ని నింపుతోందని మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగ యువతలో నెలకొన్న ఈ సందిగ్ధతను తొలగించి, వారి భవితకు భరోసా కల్పించేలా ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
*ఉపముఖ్యమంత్రితో చర్చించి స్పష్టత: మంత్రి వివేక్ వెంకటస్వామి
సభలో సభ్యులు లేవనెత్తిన ఈ విజ్ఞప్తిపై కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించారు. గ్రేటర్ పరిధిలోని పోలీసు ఉద్యోగాల నియామక ప్రకటనపై నెలకొన్న పరిస్థితిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చించి, త్వరలోనే శాసనసభ వేదికగా పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి సభకు హామీ ఇచ్చారు.
[20:11, 9/10/2026] +91 94405 08078: End


