- ముసాయిదా నోటీసులపై వేలాది మంది ఓటర్ల నిర్లక్ష్యం
- నోటీసులు తీసుకునేందుకు, ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు నిరాకరణ..
- బీఎల్ఓల ఫోన్లకూ స్పందించని వైనం
ఎల్బీనగర్:
ఓటు హక్కు కోసం ఆసక్తి చూపే కొందరు ఓటర్లు ఉన్నా , వారు తమ ఓటు వివరాల ధృవీకరణ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం అధికారులకు తలనొప్పిగా మారింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అధికారులు జారీ చేస్తున్న ముసాయిదా నోటీసులను తీసుకునేందుకు కొందరు నిరాకరిస్తుండగా, మరికొందరు అవసరమైన ధృవీకరణ పత్రాలు అందించేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరోవైపు బీఎల్ఓలు పలుమార్లు ఫోన్లు చేసి ప్రక్రియ ఉద్దేశాన్ని వివరిస్తున్నా..కొంతమంది ఓటర్లు స్పందించడం లేదని సమాచారం. ఇంటికి వెళ్లి నేరుగా సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడంతో బీఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నారు.ఓటు హక్కు అంటే ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొచ్చే హక్కు కాదని అధికారులు చెబుతున్నారు. ఓటర్ల జాబితాలో తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవడం కూడా ప్రతి ఓటరి బాధ్యతేనని సూచిస్తున్నారు.ముసాయిదా నోటీసులను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో ఓటు హక్కుకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు బీఎల్ఓలు ప్రతి ఓటరును సంప్రదించేందుకు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కొందరు ఓటర్లు కనీసం స్పందించకపోవడం పట్ల అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఓటు హక్కు కావాలంటారు.. కానీ ఆ హక్కును సక్రమంగా నమోదు చేసుకునేందుకు, కాపాడుకునేందుకు మాత్రం ఎందుకు ముందుకు రావడం లేదు?” అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో ఓటు హక్కుపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ముసాయిదా నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ వాటిని పరిశీలించి, అవసరమైన ధృవీకరణ పత్రాలను అందజేసి అధికారులకు సహకరించాలని కోరుతున్నారు.


