అన్నదాతల సాక్షిగా… అంచెలంచెలుగా ఎదిగిన ప్రస్థానం:
పాతికేళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న ప్రధాని
హైదరాబాద్
దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. రేపు అనగా సెప్టెంబరు 17వ తేదీన ప్రధాని జన్మదినం సందర్భంగా… తెలంగాణ రాష్ట్ర సమస్త ప్రజల తరఫున, తన వ్యక్తిగత తరఫున గవర్నర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు రాజ్భవన్ వర్గాలు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశాయి.
*దైవాశీస్సులు మెండుగా :
దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై శ్రీ లక్ష్మీనృసింహస్వామి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆయనకు భగవంతుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, నిత్య ఉత్సాహాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ప్రార్థించారు.
దార్శనిక నాయకత్వంలో దూసుకుపోతున్న భారత్
ప్రధానమంత్రి సమర్థవంతమైన, సుదీర్ఘ దార్శనికత కలిగిన నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని గవర్నర్ ప్రశంసించారు. దేశం అన్ని రంగాలలో అభివృద్ధి, ప్రగతి, సుసంపన్నత సాధిస్తూ మరింత వేగంగా ముందుకు సాగుతోందని కొనియాడారు. ఇదే జోరుతో దేశ సేవలో ప్రధాని మరిన్ని సంవత్సరాలు అంకితభావంతో సేవలు అందించాలని ఆకాంక్షించారు.
*పాతికేళ్ల నిరంతర ప్రజాసేవ:
ఇదే సుదినాన దేశ ప్రజల జీవితాల్లో ఆశల వెలుగులు నింపుతూ, అలుపెరగని ప్రయాణంతో 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రజాసేవను విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రధానమంత్రికి గవర్నర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి, దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న మోదీ ప్రస్థానం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.


