- ఐదు రాష్ట్రాల నుండి 3000 మంది క్రీడాకారుల హాజరు..
– పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు:
క్రీడలు ప్రతి ఒక్కరి నిత్యజీవితంలో భాగం కావాలని..శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆరిజిన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సీబీఎస్ఈ పాఠశాలల సౌత్ జోన్–1 తైక్వాండో పోటీలను ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై.. ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా ప్రతిరోజూ కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలని సూచించారు. క్రీడలు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన క్రీడా మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు మైత్రి మైదానం వేదికగా ఏడాది పొడవునా వివిధ క్రీడా అంశాలలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, యువకులు తమ ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పటాన్చెరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీలలో పాల్గొనడం పట్ల అభినందనలు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల క్రీడలకు వేదికగా నిలిచిన ఆరిజిన్ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీబీఎస్ఈ అబ్జర్వర్ దురై, ఆల్ఫా స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్లు వెంకటేష్, రాంబాబు, ఆరిజిన్ పాఠశాల చైర్మన్ ప్రమోద్, క్రీడాకారులు పాల్గొన్నారు.



