- ఎల్బీనగర్ సర్కిల్లో టౌన్ ప్లానింగ్ అధికారుల ముడుపుల బాగోతం..
- రెండు పర్మిషన్లతో నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ భారీ అక్రమ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం!
- ఒకే ప్లాట్లో రెండు రెసిడెన్షియల్ అనుమతుల వెనుక భారీ అవినీతి కుట్ర.
- సెట్బ్యాక్లు గాలికొదిలేసి, అగ్నిప్రమాదాలకు నిలయంగా మారుతున్న దిల్షుక్నగర్ – లలితా నగర్ ప్రాంతం.
- ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న అధికారుల నిర్లక్ష్యం.
- *టౌన్ ప్లానింగ్ అధికారిని టీ.పీ.ఎస్ సాయి అర్చన అవినీతి చాకచక్యం..!
- *నిఘా విభాగాలు విజిలెన్స్ అధికారులు దృష్టి సారించాలంటూ స్థానిక ప్రజల డిమాండ్..!
- *ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మామతో, ఎం.ఎం.సి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టి సారించాలి..
ఎల్బీనగర్
నగరంలోని రద్దీ ప్రాంతమైన ఎల్బీనగర్ జోన్, సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలోని లలితా నగర్లో మున్సిపల్ నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న అక్రమ నిర్మాణాల పర్వం తారస్థాయికి చేరింది. సత్యనారాయణ స్వామి ఆలయానికి ఆనుకుని, విద్యా సంస్థలు, హాస్టళ్లు, హోటళ్లతో నిత్యం కిటకిటలాడే ఈ ప్రాంతంలో అధికారుల అండదండలతో సాగుతున్న అనధికారిక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజాధనాన్ని దోచుకుంటూ, భవిష్యత్తులో పెను ప్రమాదాలకు కారణమయ్యేలా సాగుతున్న ఈ అక్రమాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే స్థలంలో రెండు అనుమతుల డ్రామా.. పన్నుల ఎగవేత
ప్లాట్ నెం. 39 (దక్షిణ భాగం), హౌస్ నెం. 13-9-73/NR, సర్వే నెం. 47 పరిధిలోని మొత్తం 320 గజాల (133.77 + 133.77 చ.మీ.) ఏకైక స్థలాన్ని యజమాని కావాలనే రెండు భాగాలుగా విభజించి చూపించారు. ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన ఫీజులు, మార్ట్గేజ్ మొత్తాలు మరియు ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్ నిబంధనలను పూర్తిగా ఎగవేసే దుర్దేశంతో విడివిడిగా రెండు దరఖాస్తులు సమర్పించి, అక్రమంగా రెండు వేర్వేరు పర్మిషన్లను చేజిక్కించుకున్నారు. కాగితాలపై మాత్రం కేవలం నివాస భవనం (Stilt for Parking + 2 Upper Floors) నిర్మిస్తున్నట్లు తప్పుడు లెక్కలు చూపారు.

*అధికారుల కుమ్మక్కు.. అవినీతికి అద్దం పడుతున్న ‘బిల్డ్ నౌ’ లోపాలు
నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో విధిగా సైట్ విజిట్ చేయాల్సిన స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ బాధ్యతను గాలికొదిలేశారు. భారీ ఎత్తున ముడుపులు స్వీకరించి, ఎలాంటి పరిశీలన జరపకుండానే ఈ అక్రమ డ్యూయల్ పర్మిషన్లను మంజూరు చేసినట్లు స్పష్టమవుతోంది. ఆన్లైన్ అనుమతుల ప్రక్రియలో పారదర్శకత లోపించడం మరియు ‘బిల్డ్ నౌ’ వెబ్సైట్ నిర్వహణలోని లోపాలు అవినీతిపరులైన అధికారులకు కాసుల వర్షం కురిపిస్తూ, అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోస్తున్నాయి.
*క్షేత్రస్థాయిలో బరితెగింపు.. నిప్పుల కొలిమిలా మారుతున్న భవనం
- కాగితాలపై రెండు వేర్వేరు నివాస భవనాలకు అనుమతులు తీసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ రెండింటిని కలిపి ఒకే భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని సాగిస్తున్నారు.
- అనుమతి లేని అదనపు సెల్లార్తో పాటు, నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 5 అంతస్తుల భారీ నిర్మాణాన్ని దౌర్జన్యంగా నిర్మిస్తున్నారు.
- కనీస సెట్బ్యాక్లు వదలకుండా, చుట్టూ రోడ్లను ఆక్రమిస్తూ, ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా వాణిజ్య సముదాయాన్ని తలపించేలా ఈ నిర్మాణం చేపడుతున్నారు.
దిల్షుక్నగర్ ఎడ్యుకేషన్ హబ్ పరిధిలో, నిత్యం వేలాది మంది విద్యార్థులు, ప్రజలు తిరిగే రద్దీ ప్రాంతంలో ఇటువంటి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తే రేపు ఏవైనా ఘోరమైన అగ్నిప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తే బాధ్యత ఎవరిది?

*ప్రధాన డిమాండ్లు:
- తక్షణ స్టాప్ వర్క్ ఆర్డర్ & కూల్చివేత: తక్షణమే సంబంధిత సిబ్బందిని రంగంలోకి దంపి, జరుగుతున్న అక్రమ కమర్షియల్ నిర్మాణాన్ని నిలిపివేయడానికి ‘స్టాప్ వర్క్ ఆర్డర్’ జారీ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అనధికార అదనపు అంతస్తులను వెంటనే కూల్చివేయాలి.
- అనుమతుల రద్దు: లంచాలు తీసుకొని, తప్పుడు వివరాలతో జారీ చేసిన ఆ రెండు అనుమతులను తక్షణమే రద్దు చేయాలి.
- అధికారులపై శాఖాపరమైన మరియు అవినీతి నిరోధక చర్యలు: క్షేత్రస్థాయి పరిశీలన పేరిట భారీగా ముడుపులు తీసుకుని, ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర గండికొట్టి, అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన టౌన్ ప్లానింగ్ అధికారులు టి.పి.ఎస్ సాయిఅర్చన మరియు ఏ.సి.పి అంబికాలపై కఠినమైన శాఖాపరమైన, అవినీతి నిరోధక చర్యలు తీసుకోవాలని ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.



