హెచ్ఎండిఏ కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి పూజలు
హైదరాబాద్:
అమీర్పేట్ మైత్రివనంలోని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండిఏ) కార్యాలయంలో బోనాల పండుగ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొనగా, అధికారులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొన్నారు.
ఆలయ సాంప్రదాయం ప్రకారం హెచ్ఎండిఏ మహిళా సిబ్బంది వేకువజామునే నిష్టతో తయారు చేసిన నైవేద్యాలతో బోనాలను శిరస్సున ధరించి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం సంస్థ ఉన్నతాధికారులు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన పిమ్మట తీర్థప్రసాదాలు స్వీకరించారు. పరిసర ప్రాంతాలు మంగళవాయిద్యాలు, భక్తిగీతాలతో మారుమోగాయి.



