హైదరాబాద్:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి వేళ ఏసీబీ సోదాలు సంచలనం రేపాయి. సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ కేసు విషయంలో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు సీఐ రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నిందితుడితో పని చేయించుకున్నారు. కొన్ని రోజులు బిర్యానీలు, కూల్ డ్రింక్స్ తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేశారు. ఆ వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. మరోవైపు లంచం డబ్బు తీసుకునే బాధ్యతను ఎస్సైకు సీఐ అప్పగించారు. ఈ సమాచారంతో డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. కీసర చెరువు గట్టు వద్ద నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్సై..రూ.5 లక్షలు లంచం తీసుకున్నాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు అక్కడికి రావడం చూసిన ఎస్సై అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. కెమికల్ టెస్టులు చేయించుకోకుండా ముప్పుతిప్పలు పెట్టాడు. అనంతరం ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి, సీఐ ఆంజనేయులును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.


