రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరణ
*షంషాబాద్ / రంగారెడ్డి:
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల (ఆగస్టు 1 నుండి 7 వరకు) సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ రూపొందించిన గోడ ప్రతులను జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కిరణ్మయి, జిల్లా సంక్షేమ అధికారి శాంతి శ్రీ, ప్రధాన వైద్యాధికారి (DM&HO) స్వర్ణలత, పాలనాధికారి సునీల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, శిశు అభివృద్ధి ప్రాజెక్ అధికారులు (CDPOలు), సంక్షేమ శాఖ సిబ్బంది మరియు జిల్లా మహిళా సాధికారత కేంద్రం (DHEW) సిబ్బంది పాల్గొన్నారు.
*తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమృతం: కలెక్టర్
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారమని తెలిపారు. పుట్టిన మొదటి గంటలోనే ముర్రుపాలు పట్టడం అత్యంత కీలకమని, పుట్టినప్పటి నుండి మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత నుంచి తగిన అనుబంధ ఆహారంతో పాటు రెండేళ్ల వయస్సు వరకు తల్లిపాలు కొనసాగించాలని సూచించారు.
తల్లిపాలు శిశువుకు రోగనిరోధక శక్తిని పెంపొందించి, అంటువ్యాధుల నుండి రక్షిస్తాయని చెప్పారు. అలాగే, బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లుల ఆరోగ్యం కూడా మెరుగవుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ఇతివృత్తం (థీమ్) “తల్లిపాలకు ప్రాధాన్యత ఇద్దాం: సుస్థిరమైన సహాయ వ్యవస్థలను ఏర్పాటు చేద్దాం” అనే సందేశాన్ని గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు.
*ఉమ్మడి బాధ్యతే ఆరోగ్యకర సమాజానికి శ్రీకారం: అదనపు కలెక్టర్
అదనపు కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ, శిశువుకు పాలివ్వడం కేవలం తల్లి బాధ్యతే కాదని, కుటుంబం, సమాజం మరియు ప్రభుత్వాల సంయుక్త బాధ్యత అని అన్నారు. ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడానికి ప్రతి ఒక్కరూ తల్లులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.
*గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు: జిల్లా సంక్షేమ అధికారి
జిల్లా సంక్షేమ అధికారి శాంతి శ్రీ మాట్లాడుతూ, ఆగస్టు 1 నుండి 7 వరకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ర్యాలీలు, అవగాహన సదస్సులు మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గర్భిణులు, బాలింతలు మరియు కుటుంబ సభ్యులు తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి, మొదటి గంటలోనే పాలిచ్చే సంప్రదాయాన్ని ప్రోత్సహించాలని కోరారు.


