ఎల్బీనగర్:
రంగారెడ్డి జిల్లాలోని వివిధ న్యాయస్థానాల పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులను సత్వరంగా పరిష్కరించేందుకు 12-09-2026న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది.జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించి జిల్లాలోని వివిధ న్యాయస్థానాల పరిధిలో మొత్తం 33 బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ బెంచీల ద్వారా రాజీ పడదగిన పెండింగ్ కేసులతో పాటు ప్రీ-లిటిగేషన్ కేసులను కూడా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ జడ్జి ఎ. కర్ణ కుమార్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా ఇరు పక్షాల పరస్పర అంగీకారంతో కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు వివాదాలకు సత్వర పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు కక్షిదారులు ముందుకు రావాలని ఆయన కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ పి. పవన్ కుమార్ మాట్లాడుతూ, 12-09-2026న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి జిల్లాలోని వివిధ న్యాయస్థానాల పరిధిలో మొత్తం 33 బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, మోటార్ వాహన ప్రమాద పరిహార, కుటుంబ వివాదాలు, బ్యాంకింగ్ తదితర రాజీ పడదగిన కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. కక్షిదారులు, న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా నిర్వహించేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మరియు సంబంధిత అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.



