ఎల్బీనగర్
అసెంబ్లీలో ఈరోజు జరిగిన క్వశ్చన్ అవర్ (ప్రశ్నోత్తరాల సమయం) సందర్భంగా వైద్య మరియు ఆరోగ్య శాఖకు సంబంధించిన చర్చలో మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీమతి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాకు గతంలో మంజూరైన మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆమె మాట్లాడుతూ,గతంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేయడం జరిగిందని, దానిని మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు వద్ద ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఆమె గుర్తు చేశారు.ప్రస్తుతం ఈ మెడికల్ కాలేజీని ఎల్బీనగర్కు తరలిస్తున్నారనే వార్తలు వింటున్నామని, ఇది ఆ ప్రాంత ప్రజలకు అన్యాయం చేయడమేనని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.శ్రీశైలం హైవేపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, అక్కడ ప్రమాదం జరిగినప్పుడు చికిత్స కోసం హైదరాబాద్ వచ్చే వరకు మధ్యలో ఎక్కడా సరైన వైద్య వసతులు లేవని, పేషంట్ హైదరాబాద్ చేరుకునేలోపు మార్గమధ్యలో చనిపోయే అవకాశం ఉందని ఆమె అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు.కాబట్టి మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం వంటి ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తే 400 పడకల ఆసుపత్రి కూడా వస్తుందని, తద్వారా ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని వివరించారు.
ఇప్పటికే కందుకూరులో స్థలం కూడా కేటాయించి, గతంలోనే మాజీ మంత్రి హరీష్ రావు ఫౌండేషన్ వేయడం జరిగిందని గుర్తు చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీని ఎల్బీనగర్కు మార్చకుండా, కందుకూరులోనే కొనసాగించాలని ప్రస్తుత వైద్యారోగ్య శాఖ మంత్రికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను గమనించాలని ఆమె కోరారు.


