- స్థానికంగా నివాసముంటున్న ప్రతి ఓటరు ఎస్ఐఆర్ లో వివరాలను నమోదు చేయించండి..
- ప్రతి ఓటు పటాన్చెరు అభివృద్ధికి పునాది..
- ఎస్ఐఆర్ ప్రక్రియలో పటాన్చెరు ను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుదాం..
- పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్చెరు:
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు నమోదు చేయించుకుని.. పటాన్చెరును రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపడంలో భాగస్వాములు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఓటర్లు, కార్మికులకు ఎస్ ఐ ఆర్ అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు.
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఓటు హక్కు ఉండడం అత్యంత అవసరమని అన్నారు. ఓటు ఉన్నప్పుడే ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో పాటు.. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. పటాన్చెరు భవిష్యత్తుకు ప్రతి ఓటు అత్యంత కీలకమని అన్నారు.
మినీ ఇండియాగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాల ప్రజలు జీవనోపాధి నిమిత్తం స్థానికంగా నివసిస్తూ.. ఓటు హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. వారందరూ విధిగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పాల్గొనాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
కులం, మతం, ప్రాంతం విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రజల పండుగలను, పర్వదినాలను కలిసిమెలిసి నిర్వహిస్తూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుపుతున్నామని తెలిపారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఎస్ఐఆర్ అంశంపై అవగాహన కల్పించారు.
ఇటీవల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నాయికోటి రాజును ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శంకర్ యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, యాదగిరి యాదవ్, మెట్టు కుమార్ యాదవ్, బాల్ రెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంతిరెడ్డి, రామచంద్ర రెడ్డి, నర్రా బిక్షపతి, పృథ్వీరాజ్, వివిధ రాష్ట్రాల ప్రజలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



