💢 కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తాం…
💢 రూ.22లక్షల పరిహారం.. తక్షణ సాయం కింద రూ.10లక్షలు అందజేస్తాం…
💢 ఇందిరమ్మ ఇల్లుతో పాటు తండ్రికి పెన్షన్ సౌకర్యం…
💢 ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి హామీ…
💢 ఎల్బీనగర్ పీఎస్ వద్ద కుటుంబసభ్యులకు, బంధువులకు ఎమ్మెల్యే భరోసా…
💢 విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన…
ఎల్బీనగర్:
ఎన్నో కలలతో ఉద్యోగంలో చేరి, అర్థాంతరంగా తనువు చాలించిన బండాలేమూర్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ సాయి ఆత్మహత్య ఘటనపై ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన కుటుంబసభ్యులు, బంధువులతో మాట్లాడిన ఆయన… దుర్ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. విధి నిర్వహణలో సాయిని ఇబ్బందికి గురిచేశారన్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులకు మల్ రెడ్డి రంగారెడ్డి సూచించారు. ఈ మేరకు మల్కాజ్ గిరి సీపీ, డీసీపీతో మాట్లాడారు. సాయి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న ఎమ్మెల్యే… ప్రత్యేక చొరవతో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే, రూ.22లక్షలను ప్రభుత్వం నుంచి అందజేయనున్నట్లు ప్రకటించిన ఆయన… తక్షణ సాయం కింద రూ.10లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. తన నియోజకవర్గానికి చెందిన సాయి కుమార్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుతో పాటు తండ్రికి పెన్షన్ వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఉన్న కోటి రూపాయల బీమా సాధ్యపడే అవకాశం లేకపోవచ్చన్న మల్ రెడ్డి… దీనిపై సీఎంతో ప్రత్యేకంగా మాట్లాడతానన్నారు. మల్ రెడ్డి రంగారెడ్డి గారు మరియు ఉన్నతాధికారుల హామీ మేరకు కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు.


